ప్రక్షాళనతో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం సమకూరేనా..?

author img

By

Published : Oct 9, 2020, 11:09 PM IST

ప్రక్షాళనతో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం సమకూరేనా..?
ప్రక్షాళనతో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం సమకూరేనా..? ()

తెలంగాణలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే సంస్థ వాణిజ్య పన్నుల శాఖ. అటు జీఎస్టీ, ఇటు వ్యాట్‌ల ద్వారా రూ. రూ. 50 వేల కోట్లకుపైగా మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు సమకూరుస్తుంది. కీలకమైన ఈ శాఖ ప్రక్షాళన పూర్తి కావడం వల్ల పరిపాలనతోపాటు రాబడులు కూడా మెరుగవుతాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. అనవసరమైన 161 పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం వాటి స్థానంలో అవసరమైన 161 పోస్టులను మంజూరు చేయడంతోపాటు కొత్తగా 18 సర్కిళ్లను, రెండు డివిజన్లను ఏర్పాటుతో పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ 12 డివిజన్లు, వంద సర్కిళ్లను కలిగి ఉంది. వాటిలో కొన్ని డివిజన్లు నాలుగైదు సర్కిళ్లు కలిగి ఉండగా మరికొన్ని సర్కిళ్లు పది నుంచి 14 సర్కిళ్లు కలిగి ఉన్నాయి. కొన్ని సర్కిళ్లలో కనీస సంఖ్యలో కూడా పన్ను చెల్లింపుదారులు లేకపోగా.. మరికొన్నింటిలో అత్యధికంగా లైసెన్స్​లు ఉండడం వల్ల పర్యవేక్షణ జరగేది కాదు. నిబద్ధతతో పని చేసినా.. ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. పాలనాపరమైన ఇబ్బందులూ తలెత్తుతూ వచ్చాయి.

కొందరు అధికారులు సరిపడినంత పనిలేక ఖాళీగా కూర్చుంటుండగా ఎక్కువ సర్కిళ్లు కలిగిన డివిజన్లలో అధికారులు మాత్రం పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. గతంలో వాణిజ్య పన్నుల కమిషనర్‌గా పని చేసిన, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.

అందరికి సమానంగా పని ఉండేట్లు చూడడం, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను, పని ఒత్తిడి కారణంగా పాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రామాణికంగా తీసుకుని సర్కిళ్లను, డివిజన్లను ప్రక్షాళన చేసే దిశలో పునర్విభజన చేసేందుకు వీలుగా 2018 మే 22న ప్రత్యేకంగా జీఓ 145 ఇచ్చారు. ఆ తరువాత ప్రక్షాళన కార్యక్రమం పూర్తి కాలేదు. ఆలా ఉండిపోయింది.

సోమేశ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. వాణిజ్య పన్నుల శాఖ పునర్​వ్యవస్తీకరణ ప్రక్రియకు తిరిగి ప్రాణం వచ్చింది. మొదట 12 డివిజన్లను మరో రెండు పెంచి14 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అత్యధికంగా సర్కిళ్లు కలిగిన హైదరాబాద్‌ రూరల్‌, సరూర్‌నగర్‌- 2లను కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఆ తరువాత సర్కిళ్ల పరిధిలో కూడా లైసెన్స్​ల సంఖ్య ఎక్కువ, తక్కువ ఉన్నందున వాటి రూపు రేఖలను కూడా మార్చింది. అధికంగా పన్ను చెల్లింపుదారులు కలిగిన సర్కిళ్లలో పని ఒత్తిడి అధికంగా ఉన్నట్లు గుర్తించి పునర్‌వ్యవస్తీకరణ చేశారు. అన్ని సర్కిళ్లకు సమాన పని వచ్చేట్లు ఇప్పుడున్న వంద సర్కిళ్లకు అదనంగా మరో 18 సర్కిళ్లను ఏర్పాటు చేశారు.

కొత్త సర్కిళ్లలో.. అబిడ్స్‌ డివిజన్‌ పరిధిలో బషీర్‌బాగ్‌, నాంపల్లి, బేగంపేట్‌ డివిజన్‌ పరిధిలో బేగంపేట్‌, రాణిగంజ్‌, పంజాగుట్ట పరిధిలో జూబ్లీహిల్స్‌లో రెండు, సోమాజిగూడ, పంజాగుట్ట, శ్రీనగర్‌ కాలనీ, వెంగల్‌రావునగర్‌లు, సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో మహంకాలి, హైదరాబాద్‌ రూరల్‌ పరధిలో మాదాపూర్‌లో నాలుగు నల్గొండ డివిజన్‌ పరిధిలో నారాయణపేట్‌, వనపర్తి, వరంగల్ డివిజన్‌ పరిధిలో ములుగులల్లో కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది.

పునర్‌ వ్యవస్థీకరణకు తగినట్లు పోస్టులు కూడా అవసరం ఉండటం వల్ల అనవసరంగా ఉన్న పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పోస్టులను మంజూరు చేశారు. పునర్‌ వ్యవస్థీకరణకు ముందుగా అవసరం లేకుండా ఉన్న పోస్టులు.. 37 జూనియర్‌ అసిస్టెంట్లు, 30 టైపిస్టులు, 35 రికార్డ్‌ అసిస్టెంట్లు, 59 డ్రైవర్‌ పోస్టులను ఇలా మొత్తం 161 పోస్టులను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా ఇప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా 161 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరైన పోస్టుల్లో జాయింట్‌ కమిషనర్‌ పోస్టులు- 3, ఉపకమిషనర్లు- 6, సహాయ కమిషనర్లు- 10, సీటీవోలు- 18, డీసీటీలోలు- 59, ఏసీటీవలో- 65 లు ఉన్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలో.. 14 డివిజన్లకు, 118 సర్కిళ్లకు సర్కిళ్లకు సమాన పని ఉండేట్లు జీఎస్టీ, వ్యాట్‌ పన్నుల చెల్లింపుదారులను సర్దుబాటు చేశారు. ఒక్కో వాణిజ్య డివిజన్‌ పరిధిలో ఏడు లేక ఎనిమిది సర్కిళ్లు ఉండేట్లు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో.. ఐదు డివిజన్లు ఉండగా హైదరాబాద్‌ నగరంలోనే తొమ్మిది డివిజన్లు ఉన్నాయి. పెద్ద డివిజన్లను విడగొట్టడం, సర్కిళ్లలో వాణిజ్య పన్ను చెల్లింపుదారులను సర్దుబాటు చేయడం ద్వారా పాలనాపరంగా సౌలభ్యత ఏర్పడి ఆయా డిప్యూటీ కమిషనర్లపై పని ఒత్తిడి తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పన్ను ఎగవేతదారులపై దృష్టిసారించి కిందిస్థాయి అధికారులతో సమీక్షలు చేస్తూ.. పనితీరును మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. వాహన తనిఖీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను సోదాలు నిర్వహించి.. ఎగవేతదారులను కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో రూ. 50 వేల కోట్లకుపైగా వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఆర్థిక వనరులు ప్రభుత్వానికి సమకూరనుండగా 2020-21 ఆర్థిక ఏడాదిలో కొవిడ్‌ ప్రభావం ఉండడం వల్ల కొంత మేర ఆదాయం తగ్గే అవకావం ఉందని అంచనా వేస్తున్నారు. నిఘా పెంచేందుకు అవకాశం ఉన్నందున ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా పన్నుల వసూళ్లు పెరిగే అవకాశం అధికంగా ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 'జీఎస్టీ వచ్చినా.. డబ్బులు దండుకుంటున్నారు..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.