ETV Bharat / state

సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాల కలకలం

author img

By

Published : Jan 4, 2023, 9:57 AM IST

vijayawada kanaka durga idol photos viral: ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు- సామాజిక మాధ్యమాల్లోకి రావడం కలకలం సృష్టిస్తోంది. దృశ్యాలు రావడంపై ఆలయ ఈవో భ్రమరాంబ స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి అంతరాలయ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో... ఎవరు పెట్టారన్నదానిపై ఆరా తీయించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఈవో- వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో దుర్గగుడిలోని సెక్యూరిటీ సిబ్బంది విధుల నిర్లక్ష్యానికిగాను నోటీసులు జారీ చేశామన్నారు.

Bejawada Kanakadurgamma
Bejawada Kanakadurgamma

vijayawada kanaka durga idol photos viral: జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు- సామాజిక మాధ్యమాల్లోకి రావడం కలకలం సృష్టిస్తోంది. దుర్గమ్మ అంతరాలయాన్ని చరవాణితో చిత్రీకరించి- సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ఆలయ అంతర్గత భద్రత వైఫల్యాలను బహిర్గతం చేసింది. అమ్మవారి సన్నిధిలోకి చరవాణిల అనుమతి లేకపోయినా దృశ్యాలను చిత్రీకరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌టీఎఫ్‌ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమేరాల నిఘా ఉన్నప్పటికీ దృశ్యాల చిత్రీకరణకు ఎందుకు సాహసిస్తున్నారు? అప్పుడు నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాల కలకలం

వీవీఐపీలు, ముఖ్యుల వెంట వారికి సహాయకులుగా వస్తోన్న వారి ఫోన్లను భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. అలాగే టిక్కెట్టు కొనుగోలు చేసి వస్తోన్న భక్తులను రద్దీ సమయంలో అదుపు చేయడంలోనూ భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తన మొక్కులు చెల్లించుకునేందుకు కొద్దినెలల క్రితం ఓ సినిమా నటుడు వచ్చిన సమయంలో అభిమానులు అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిలుచుని మరీ చరవాణిలో దృశ్యాలు బంధించారు. ఆ తర్వాత దేవస్థానం తక్షణ చర్యలుగా ఆలయంలో సంప్రక్షణతోపాటు ఇతర వైదిక కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి మూలవిరాట్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నట్లు వీడియోతో సహా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో ధర్భముళ్ల భ్రమరాంబ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా దృశ్యాలు చిత్రీకరించింది ఎవరు? ఎప్పుడు? అనే విషయాలపై ఆరా తీయించారు. శాంతకుమారి అనే భక్తురాలు ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లుగా గుర్తించామని ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటల 52 నిమిషాలకు చిత్రీకరించినట్లు తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఈవో- నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దుర్గగుడిలోని సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.