ETV Bharat / state

ప్రశ్నపత్రాల లీకేజీ.. నేడో రేపో ఆ అయిదు పరీక్షల కొత్త తేదీల ప్రకటన.!

author img

By

Published : Mar 28, 2023, 7:53 AM IST

TSPSC
TSPSC

TSPSC Clarity on Exams Dates : ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దైన, వాయిదా పడిన పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. ఐదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను నేడో రేపో టీఎస్పీఎస్సీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హార్టికల్చర్‌ అధికారుల పోస్టు పరీక్షపై టీఎస్​పీఎస్సీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.

TSPSC Clarity on Exams Dates : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దైన, వాయిదా పడిన ఐదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై టీఎస్​పీఎస్​సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ పేపర్ లీకేజీ నేపథ్యంలో కమిషన్‌ నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలనురద్దు చేయగా... మరో రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షతోపాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షలు రద్దయ్యాయి. కమిషన్​ నిర్వహించే టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

నేడో రేపో కొత్త తేదీల ప్రకటన : టీఎస్​పీఎస్సీ ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ క్రమంలో మిగిలిన రద్దయిన పరీక్షలతోపాటు వాయిదా పడిన వాటికి టీఎస్​పీఎస్సీ మంగళ లేదా బుధవారాల్లో కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పోస్టుల రాత పరీక్షలను గతంలో ఓఎంఆర్​ పద్ధతిలో టీఎస్​పీఎస్సీ నిర్వహించింది. అయితే తాజాగా వీటికి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏయే పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఏయే పరీక్షలు ఓఎంఆర్​ పద్ధతిలో ఉంటాయన్న అంశాన్నీ కొత్త తేదీలతో పాటు ప్రకటించే అవకాశాలున్నట్లు కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఉద్యాన అధికారుల పోస్టు పరీక్ష.. యథాతథమా ? రీషెడ్యూలా? : హార్టికల్చర్‌ అధికారుల పోస్టు పరీక్షపై టీఎస్​పీఎస్సీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ పరీక్షను యథావిధిగా నిర్వహిస్తారా..? లేక కొంత వ్యవధితో రీషెడ్యూలు చేస్తారా అనే విషయమై కమిషన్ స్పష్టత ఇవ్వనుంది. ఈ హార్టికల్చర్ అధికారుల పోస్టులకు గతంలో కమిషన్‌ ఏప్రిల్‌ 4న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉద్యాన అధికారుల పోస్టు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు ప్రవేశపత్రాలను కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉంది. దీని ప్రకారం మంగళవారం (ఈ నెల 28వ తేదీన) ప్రవేశపత్రాలు(హాల్​టికెట్లు) వెబ్​సైట్లో అందుబాటులోకి రావాలి. మొత్తం 22 హార్టికల్చర్‌ అధికారుల పోస్టులను భర్తీ చేయనుండగా.. ఈ పరీక్షకు తక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదే ఒకవేళ ఉద్యాన అధికారుల పోస్టు పరీక్షను వాయిదా వేస్తే.. కొంత వ్యవధిలోనే తిరిగి ఆ పరీక్షను నిర్వహించేందుకు అనువైన తేదీలను టీఎస్​పీఎస్సీ పరిశీలిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.