ETV Bharat / state

రిజిస్ట్రేషన్లలో లోటుపాట్లు... సవరించే పనిలో ప్రభుత్వం

author img

By

Published : Dec 19, 2020, 10:38 AM IST

తెలంగాణలో వ్యవసయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లల్లో తలెత్తుతున్న లోటుపాట్లను సవరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లలో లింక్ డాక్యుమెంట్ కూడా జత చేసుకోవడానికి అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ విశాఖ నుంచి డిజిటల్ సంతకాలతో ఇచ్చే డాక్యుమెంట్లపై అదనంగా సబ్ రిజిస్టర్ పెన్​తో సంతకం చేసి ఇవ్వడానికి అనుమతినిచ్చింది.

Ts government has been working to rectify the shortcomings in the registration of non-agricultural assets and land
రిజిస్ట్రేషన్లలో లోటుపాట్లు... సవరించే పనిలో ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్​ల ప్రక్రియలో సమూల మార్పులు చేర్పులను తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. సరళతరం చేయడం, పారదర్శకత తీసుకురావడం, వేగవంతమైన సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నెల 14 నుంచి మార్పులతో కూడి మొదలైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో లోటుపాట్లను క్రమంగా సరిదిద్దుతోంది. అందులో భాగంగానే ఇటీవల అన్ని వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా వర్గాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఒకటి ఒకటి పరిష్కరించే పనిలో ప్రభుత్వం పడింది.

సాధారణంగా వ్యవసాయేతర భూములు కానీ, ఆస్తులుకాని అమ్మాలన్నా… కొనాలన్నా వాటి చరిత్రను తెలియపరిచే లింక్ డాక్యుమెంట్లు అవసరం. కొన్నిసార్లు లింక్ డాక్యుమెంట్లు ఎక్కువ ఉన్నట్లయితే వాటిని క్రోడీకరించి ఒక డాక్యుమెంటులో రాసుకుంటారు. దానిని తీసుకెళ్లి ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్​కు ఉపయోగిస్తారు. దానిని రిజిస్ట్రేషన్ చేసేముందు సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్​ను పరిశీలిస్తారు. లింక్ డాక్యుమెంట్లల్లో ఉన్న వివరాలనే క్రోడీకరించి రాసిన డాక్యుమెంట్​లో ఉన్నాయా లేవా అని చూస్తారు. అన్ని వివరాలతో డాక్యుమెంట్ ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ విధానంలో ఈ లింక్ డాక్యుమెంట్ల ప్రస్తావన లేదు. ఇది ఆస్తుల క్రయవిక్రయాలకు, బ్యాంక్ రుణాల మంజూరుకు ప్రధాన ఆటంకంగా ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

లింక్ డాక్యుమెంట్ల వివరాలతో తెచ్చే డాక్యుమెంటును రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్కాన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఇచ్చే డాక్యుమెంట్లతో కలిపి ఇది కూడా ప్రింట్ తీసి ఇస్తారు. అయితే డిజిటల్ సంతకలతో కూడిన ఆస్తుల డాక్యుమెంట్లపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లింకు డాక్యుమెంట్ల వివరాలను కూడా పొందుపరుచుకోవడం కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా చేసిన ప్రభుత్వం... రిజిస్ట్రేషన్ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఇచ్చే డాక్యుమెంట్లపై సంబంధిత అధికారి పెన్​తో సంతకం చేసి ఇచ్చేట్లు అనుమతి ఇచ్చింది. ఇలా ఒకటి ఒకటి అన్నింటిని సరిదిద్దుకుంటూ వెళుతున్న ప్రభుత్వం చిన్న తప్పిదం కూడా లేని లావాదేవీలు జరిగేట్లు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల జరిగిన సమావేశంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి సమస్యల పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఇవీ చూడండి: రైతు ఖాతాలో 4 వందల కోట్లు... చేతికి పైసా రావట్లేదు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.