ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

author img

By

Published : Dec 3, 2022, 7:22 PM IST

Updated : Dec 3, 2022, 7:44 PM IST

MLC Kavitha
MLC Kavitha

11:50 December 03

Delhi Liquor Scam update : సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Delhi Liquor Scam update
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఇచ్చిన నోటీసులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ కేసులో క్లారిటీ కోసం కవితను విచారించాలనుకుంటున్నామని సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసుద్వారా సీబీఐ శుక్రవారం రోజున సమాచారం అందించింది. దీనిపై కవిత స్పందిస్తూ ఇవాళ సీబీఐకి లేఖ రాశారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎఫ్ఐఆర్, సీబీఐకి.. కేంద్రం ఇచ్చిన ఫిర్యాదు ప్రతులు తనకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని అన్నారు. డాక్యుమెంట్లు అందిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చునని తెలిపారు.

అసలేం జరిగిందంటే.. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. దిల్లీలో నమోదు చేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్‌ కుమార్‌ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి. విచారణ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. దర్యాప్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ అంశాలపై మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది.’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రాయ్‌ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాతోపాటు మరో 14 మందిపై కేసు నమోదైనట్లు ఇందులో తెలిపారు.

సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత ధ్రువీకరించారు. ‘‘నా వివరణ కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని మా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశా. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా’’ అని కవిత శుక్రవారం రాత్రి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎఫ్ఐఆర్, సీబీఐకి కేంద్రం ఫిర్యాదు ప్రతులు అందజేయాలని సీబీఐకి కవిత లేఖ రాశారు.

Last Updated :Dec 3, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.