ETV Bharat / state

TRS complaint on jagga reddy: 'ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు'

author img

By

Published : Dec 3, 2021, 3:21 PM IST

TRS Leaders complaint on jagga reddy, local bodies mlc elections
జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేసిన తెరాస నేతలు

TRS Leaders complaint on jagga reddy : స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్​కు ఫిర్యాదు చేశారు.

TRS Leaders complaint on jagga reddy : స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెరాస నేతలు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు తెరాస నేతలు బుద్ధభవన్​లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్​ను కలిసి... ఫిర్యాదు చేశారు. పోలింగ్​కు ముందు రూ.50వేలు, తర్వాత రూ.2లక్షలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలు ప్రకటనలు ఇస్తున్నారన్న తెరాస నేతలు... నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు గురి చేయడం నేరమన్న తెరాస నేతలు... జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తెరాస పక్కా ప్రణాళిక..

తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార తెరాస పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అయిదు జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అన్నింటా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆ పార్టీ ముందు జాగ్రత్తగా నాలుగు జిల్లాల్లోని తమ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులను ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విహార యాత్రలకు పంపి, శిబిరాలను నిర్వహిస్తోంది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా... ఇందులో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో రెండేసి, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున స్థానాలు ఏకగ్రీవం కాగా, ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ జిల్లాల్లో తెరాసకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా... అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో అధిష్ఠానం, 4 జిల్లాల్లోని ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించింది.

ఆదిలాబాద్‌: ఈ జిల్లాలో ఒక స్థానానికి తెరాస నుంచి దండె విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పి.పుష్పరాణి పోటీలో ఉన్నారు. మొత్తం 937 మంది ప్రజాప్రతినిధులకు 717 మంది తెరాసవారున్నారు.

కరీంనగర్‌: ఇక్కడ రెండు స్థానాల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 1324 మందికి 996 మంది తెరాస వారున్నారు.

ఖమ్మం: ఇక్కడ ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. 768కి 490 మంది తెరాస వారున్నారు.

మెదక్‌: ఒక స్థానంలో మెదక్‌ జిల్లాలో తెరాస అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో నిలిచారు. 1026 ప్రజాప్రతినిధుల్లో 777 మంది అధికార పార్టీవారున్నారు.

నల్గొండ: ఇక్కడ తెరాస నుంచి ఎంసీ కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 1271 మంది ప్రజాప్రతినిధులకు.. తెరాస 991 వారు ఉన్నారు.

ఇదీ చదవండి: Nalgonda MLC Elections: ఆసక్తికరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్యాంపులు పెట్టక తప్పదా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.