సైదాబాద్ ఘటన అత్యంత దుర్మార్గమైన చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున ఘటన జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఘటనపై ఇప్పటివరకూ ఏ ఒక్క మంత్రీ స్పందించలేదని.. నిందితుడిని అరెస్టు చేయలేదని మండిపడ్డారు. హత్యాచార ఘటనపై ఇంతవరకూ హోంమంత్రే స్పందించలేదని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కాలనీలో బాలిక కుటుంబాన్ని రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు.
రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరగడం లేదు. ఐదు రోజులు గడిచినా నిందితుడిని ఇంతవరకూ పట్టుకోలేదు. పోలీసులు ఏం చేస్తున్నారు. అరడజనకు పైగా మంత్రులు హైదరాబాద్లోనే ఉన్నా.... ఇప్పటివరకు బాధిత కుటుంబాన్ని ఏ ఒక్క మంత్రీ పరామర్శించలేదు. నగరం నడిబొడ్డున ఇలాంటి ఘటన జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది. గంజాయి రవాణా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖజానా నింపుకోవడం కోసం మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారు. మద్యం, గంజాయి మితిమీరి వాడకం ద్వారానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గంజాయి అమ్మకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్ ఆగ్రహం...
ప్రభుత్వ తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఇంతవరకూ పోలీసు కమిషనర్ పరామర్శించకపోవడమే కాక.. న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యువకులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడం దారుణమని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుడుంబా, గంజాయి వ్యవహారంపై స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని రేవంత్ తప్పుబట్టారు. డ్రగ్స్, మద్యం అమ్మకాలే ఇలాంటి అమానవీయ ఘటనలకు కారణమని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిన పోలీసులు.. ప్రతిపక్షాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రేవంత్ విమర్శించారు.
ఇదీ చదవండి: ‘నల్లధనం’ కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు