ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ 7AM

author img

By

Published : Sep 10, 2022, 7:00 AM IST

Telangana Top News
టాప్​న్యూస్ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • బైబై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్​ మహాగణనాథుడి నిమజ్జనం అట్టహాసంగా ముగిసింది. భక్తజనుల కోలాహలం, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య మహా గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ గణేశుడిని భక్తులు సాగనంపారు.

  • భాగ్యనగరంలో కన్నుల పండువగా గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర..

Ganesh Immersion in Hyderabad: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జన శోభయాత్ర కనుల పండువగా సాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాధులు హుస్సేన్‌సాగర్‌ తీరానికి తరలివెళ్తున్నాయి. విభిన్నరూపాల్లోని లంబోదరుల శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోస్తు ఏర్పాటు చేశారు.

  • 'అరవై ఏళ్లుగా దిగుమతి చేసుకుంటున్నాం.. ఇకపై భారత్​లోనే తయారీ'

భారతీయ రైలు చక్రాలు ఇక పూర్తిస్థాయిలో స్వదేశంలో తయారు కానున్నాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రైవేటు సంస్థలకు కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వనున్నారు. ఆరవై ఏళ్లుగా రైలు చక్రాలు దిగుమతి చేసుకుంటున్నామని.. ఇప్పుడు స్వదేశంలో తయారు చేయాల్సిన అవసరం వచ్చిందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

  • కేంద్రం అడ్డుపడ్డా.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదు

KTR tweet today: తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కానీ అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని అడ్డుకోలేరని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విటర్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి ఆక్షేపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఫార్మాసిటీ వంటి ఏ అంశంలోనూ కేంద్రం తోడ్పాడు అందించకపోయినా.. తెలంగాణ తమ సత్తా చాటిందని ట్వీట్ చేశారు.

  • 'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్

Rahul Gandhi T shirt : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. రాహుల్​ అత్యంత ఖరీదైన టీషర్ట్ వేసుకున్నారని, విలాసవంతమైన కంటైనర్లలో బస చేస్తున్నారని భాజపా విమర్శలు గుప్పించగా.. కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది. పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను కమలదళం ఓర్వలేకపోతోందని మండిపడింది.

  • 500 కిలోల నగలు ఉన్నా తెల్ల రేషన్ కార్డ్.. కౌన్సిలర్​కు కోర్టు షాక్

భారీగా ఆస్తులు ఉన్నా, తెల్ల రేషన్​ కార్డ్​ కలిగి ఉన్న నగర పాలక సంస్థ కౌన్సిలర్​ ఎన్నిక చెల్లదని ప్రకటించింది కర్ణాటకలోని ఓ కోర్టు. ఎన్నికల అఫిడవిట్​లో వాస్తవాల్ని దాచిపెట్టారని నిర్ధరిస్తూ తుమకూరు జిల్లా సిరాలోని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫలితంగా జేడీఎస్​ కౌన్సిలర్ రవి శంకర్​ పదవి కోల్పోయారు.

  • గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

గణేశ్​ నిమజ్జనం వేడుకల్లో అపశ్రుతి జరిగింది. గణేశ్ నిమజ్జనం చేస్తుండగా కాలువలో పడి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన హరియాణాలోని మహేంద్రగఢ్​ జిల్లాలో జరిగింది. యూపీలో జరిగిన మరో ఘటనలోను నిమజ్జనం చేస్తూ నదిలో పడి ముగ్గురు మరణించారు.

  • పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం.. ఫైనల్లో మరోసారి ఢీ

Asia Cup 2022 : ఆసియా కప్​ 2022 లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక. ​ఈ ఉత్సాహంతో ఆదివారం జరగబోయే ఫైనల్​లో కూడా విజయం సాధించాలని లంక జట్టు ఆత్రుతగా ఉంది. 121 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక.. మూడు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్​ను ముగించింది. పాతుమ్ నిస్సాంక 48 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడు కెప్టెన్ దాసున్​ శనక 16 బంతుల్లో 21 పరుగులు, భనుక రాజపక్స 19 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టును విజయతీరాల వైపు నడిపించారు.

  • 'మహర్షి' రైతు ఇకలేరు.. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత

'మహర్షి' చిత్రంలో రైతుగా నటించి మెప్పించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహర్షి'లో సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో రైతుగా గురుస్వామి నటించారు. గురుస్వామితోనే కలిసి మహేశ్‌ సినిమాలో వ్యవసాయం చేస్తారు. మట్టి, రైతుల మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే సన్నివేశంలో గురుస్వామి నటన భావోద్వేగంగా సాగుతుంది.

  • 'థ్యాంక్‌ గాడ్‌' ట్రైలర్​ రిలీజ్​.. తెలుగులో శింబు సందడి

Thank God Movie Trailer : బాలీవుడ్​ కథానాయకులు అజయ్‌ దేవ్‌గణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర కలిసి నటించిన చిత్రం 'థ్యాంక్‌ గాడ్‌'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను చిత్ర బృందం విడుదల చేసింది. తమిళ హీరో శింబు, ప్రముఖ డైరక్టర్​ గౌతమ్​ మీనన్​ కలయికలో వస్తున్న చిత్రం 'వెందు తనిందతు కాడు'. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.