ETV Bharat / state

srisailam project: కృష్ణా బోర్డు నిర్వహణలో.. శ్రీశైలమే కీలకం

author img

By

Published : Jul 26, 2021, 6:54 AM IST

the-srisailam-project-is-crucial-in-the-management-of-the-krishna-board
కృష్ణా బోర్డు నిర్వహణలో.. శ్రీశైలమే కీలకం

45 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలంపైనే ఆధారపడి ఉన్నాయి. 400 టీఎంసీల్లో 34 టీఎంసీలకు మాత్రమే కేటాయింపు ఉంది. మిగిలినదంతా మిగులు జలాలపైనే ఆధారం. దీంతో నిర్వహణ, నీటి విడుదల సవాలుగా మారింది.

కృష్ణా బోర్డు నిర్వహణలో శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. సుమారు 400 టీఎంసీలతో 45 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలంపై ఆధారపడి ఉండగా, ఇందులో ఒకటి మినహా మిగిలినవన్నీ మిగులు జలాలపై ఆధారపడి ఉన్నవే. ప్రస్తుతానికి తెలంగాణలో 200 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లో 200 టీఎంసీల వినియోగానికి తగ్గట్లుగా ప్రాజెక్టులు వినియోగంలోనూ, నిర్మాణంలోనూ ఉండగా.. మరింత వరద నీటిని తీసుకెళ్లేలా ఆంధ్రప్రదేశ్‌ విస్తరణ పనులు చేపట్టింది. ఈ విస్తరణతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న సామర్థ్యం ప్రకారమే రోజూ 90 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వైపు 59,100 క్యూసెక్కులు కాగా, తెలంగాణ వైపు 31,200 క్యూసెక్కులు. శ్రీశైలం నుంచి తీసుకునే నీటిలో 34 టీఎంసీలకు మాత్రమే కేటాయింపు ఉంది. మిగిలినదంతా మిగులు జలాలపైనే ఆధారం.

గత ఏడు సంవత్సరాల్లో రెండేళ్లలోనే మెరుగైన ప్రవాహం

వరద వచ్చినపుడు కాకుండా.. సీజన్‌ ఆరంభంలో ఆయా ప్రాజెక్టుల అవసరాలకు తగ్గట్లుగా నీటిని విడుదల చేయడం, నిర్వహించడం బోర్డుకు సవాలుగా మారే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి ఆలమట్టిలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం ప్రారంభమైన తర్వాత జూన్‌, జులై నెలల్లో శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం చాలా తక్కువ. 2014-15 నుంచి ఏడు సంవత్సరాలకుగాను రెండేళ్లలో మాత్రమే ప్రవాహం మెరుగ్గా ఉంది. ఆగస్టులో ప్రవాహం మొదలైనా శ్రీశైలం దిగువన ఉన్న ప్రాజెక్టుల అవసరాలను మొదట పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దిగువన నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులలో వరద వచ్చిన రోజుల్లో మాత్రమే ఎక్కువ నీటిని మళ్లించాల్సి వస్తుంది. మొత్తం పంట కాలానికి రోజూ నీటిని ఎత్తిపోసే ఎత్తిపోతల పథకాలకు ఇది సాధ్యం కాదు. అలాగే సొరంగాలు కూడా.

కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 ఆలమట్టి ఎత్తును పెంచడానికి అంగీకరించడంతో పాటు మరో 130 టీఎంసీలు ఈ ప్రాజెక్టులో అదనంగా కేటాయించింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈ తీర్పును కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదు. ఇది అమలులోకి వస్తే శ్రీశైలంలోకి నీటి ప్రవాహం చేరడంలో మరింత జాప్యమవుతుంది. ప్రాజెక్టుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రెండు రాష్ట్రాలకు శ్రీశైలం కీలకమైన ప్రాజెక్టు కాగా, బోర్డు నిర్వహణలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. రెండువైపులా విద్యుదుత్పత్తి ఉండగా, ఈ రెండింటికి కనీస నీటిమట్టం దిగువన తీసుకోవడానికి అవకాశం ఉంది.

మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులే ఎక్కువ

శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వాటిలో మిగులు జలాల ఆధారంగా చేపట్టి నీటిని తీసుకునేవే ఎక్కువ. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ కలిపి సుమారు 400 టీఎంసీలు అవసరం కాగా, ఇందులో తెలంగాణలోని ప్రాజెక్టులకు 200 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు 200 టీఎంసీలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌.ఆర్‌.బి.సి.)కి 19 టీఎంసీల కేటాయింపు ఉండగా, చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు.. అంటే 34 టీఎంసీలు నికరజలాల నుంచి కేటాయింపు ఉంది. మిగిలినవన్నీ మిగులు జలాలపై ఆధారపడినవే.

2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పేర్కొన్న కల్వకుర్తి, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, నెట్టెంపాడు ప్రాజెక్టుల్లో.. నెట్టెంపాడు మినహా మిగిలిన ఐదూ శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనేవి. ఎస్‌.ఎల్‌.బి.సి.ని 11వ షెడ్యూలులో చేర్చాలంటూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోనే కేంద్రానికి అప్పటి ప్రభుత్వం లేఖ రాసింది. దీని ప్రకారం ఆరు ప్రాజెక్టులు శ్రీశైలం మీద ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి, ఎస్‌.ఎల్‌.బి.సి సామర్థ్యాన్ని పదేసి టీఎంసీల చొప్పున పెంచడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను 120 టీఎంసీలతో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు విస్తరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

ఇదీ చూడండి: RAMAPPA TEMPLE: కాకతీయుల ప్రాభవానికి ప్రతీక.. రామప్పగుడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.