తెలంగాణ ఆడపడుచులను ఆటపట్టించడం అంత ఈజీ కాదు!

author img

By

Published : Jan 2, 2023, 4:55 PM IST

Telangana Women Safety Department
Telangana Women Safety Department ()

Women Trafficking in Telangana : మహిళలు, చిన్నారుల భద్రత లక్ష్యంగా మహిళా భద్రతా విభాగం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. లైంగిక నేరాలు, వేధింపుల కట్టడికి షీ టీమ్‌లు, భరోసా కేంద్రాలను పటిష్ఠం చేస్తోంది. ఆన్‌లైన్ వేధింపుల బారిన పడకుండా అధికారులు యువతులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళల అక్రమరవాణా నిరోధించడానికి, ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను రక్షించడానికి మహిళా భద్రతా విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

Women Trafficking in Telangana : రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం పోలీస్ శాఖలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి నేతృత్వంలో మహిళా భద్రతకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు రాష్ట్రంలో ఎక్కడ లైంగిక వేధింపులకు గురైనా... వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ మేరకు ఆకతాయిల ఆటకట్టించేందుకు షీటీమ్ పోలీసులు మఫ్టీలో నిఘా పెడుతున్నారు.

Telangana Women's Safety Department : బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్, అటకాంపులు, సోషల్ మీడియా వేధింపులను అరికట్టేందుకు షీ టీంలు విస్తృత స్థాయిలో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది షీ టీమ్ లకు 6157 ఫిర్యాదులు రాగా, 521 ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 1206 పెట్టీ కేసులు నమోదయ్యాయి. 1842 మంది కి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన వారిలో 1751 మంది మేజర్ లు కాగా, 90 మంది మైనర్ లకు ఆన్‌లైన్‌లో నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు.

Telangana Women Safety Department : అంతర్జాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఆన్ లైన్‌లో పాఠాలు వింటున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలో సైబర్ వేధింపులకు గురవుతున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సంఖ్య అధికం అవుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని, వ్యక్తిగత చిత్రాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ వేధిస్తున్న ఘనటలపై కేసులు నమోదవుతున్నాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా భద్రతా విభాగం సైబర్ కాంగ్రెస్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యా శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలకు వెళ్లే పిల్లలకు సైబర్ నేరాల పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2వేల 381 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ ఏడాది 33 కళాశాలల్లో బాలికల సేఫ్టీ క్లబ్ లు ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలో సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

లైంగిక నేరాలబారిన పడిన మహిళలకు సాయం అందించేందుకు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. బాధితులకు సాంత్వన చేకూర్చడం, వైద్యం, న్యాయ సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు ముందున్నాయి. ఈ సంవత్సరం భరోసా కేంద్రాలకు వచ్చిన ఫిర్యాదుల్లో 23 మంది కేసులు నమోదుచేశారు. నిందితులకు వీరందరికీ న్యాయ స్థానం శిక్షలు విధించేలా భరోసా సిబ్బంది సఫలమయ్యారు.

హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ఉన్న భరోసా కేంద్రాలకు అదనంగా ఈ ఏడాది మరో 5 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల్, మెదక్ జిల్లాల్లో భరోసా కేంద్రాల తోపాటు మరో 12 జిల్లాలలో భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. లైంగిక నేరాల దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. అత్యాచారం కేసులకు సంబంధించి సెప్టెంబర్ వరకు 84 శాతం కేసులకు 2 నెలల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. తిరువనంతపురంలో జరిగిన సౌత్ జోనల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని సైతం అభినందించింది.

రాష్ట్రంలోని 250 పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2,208 మంది శిక్షణపొందిన పోలీసు అధికారులను ఈ హెల్ప్ డెస్క్ లో నియమించారు. గృహ హింస బాధితులకు భరోసా కల్పించేందుకు ధైర్య అనే యాప్ ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనిని డయల్ 100, అన్ని మహిళా పోలీసు స్టేషన్లు, మహిళా భద్రతా విభాగానికి అనుసందానం చేశారు. ధైర్య యాప్ ద్వారా మొత్తం 48685 కాల్స్ వచ్చాయి.

ప్రవాస భారతీయ మహిళలు మోసాలబారిన పడితే వాళ్లకు తగిన న్యాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. 85 పిర్యాదులు అందగా, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. మహిళా భద్రతా విభాగంలోని షీ సైబర్ ల్యాబ్‌లో ఉన్న అధునాతన మొబైల్ ఫోరెన్సిక్ సాధనాన్ని ఉపయోగించి తప్పయిపోయిన 4 గురు మైనర్ బాలికలను బెంగుళూరు, ముంబై లలో కనుగొనగా, ఒక అబ్బాయిని తిరుపతిలో గుర్తించారు. పిల్లల అశ్లీల దృశ్యాలతో పాటు, ఆన్‌లైన్ వ్యభిచారానికి సంబంధించిన 12 లింకులను గుర్తించడం తోపాటు వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటికి సంబంధించి11 మంది నిందితులను అరెస్టు చేశారు.

మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో 291 కేసులలో 894 మంది నేరస్థులను, సైబర్ సంబంధిత 454 కేసుల్లో 408 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మహిళలు, చిన్నారులపై తరచూ నేరాలకు పాల్పడుతున్న 53 మందిని గుర్తించి వాళ్ల గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్రొఫైల్‌లను రూపొందించి ముందు జాగ్రత్తలు తీసుకుంనేలా మహిళా భద్రతా విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.