ETV Bharat / state

TS New Secretariat: నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ.. సంక్షేమంపై సీఎం సంతకం

author img

By

Published : Apr 29, 2023, 6:53 AM IST

Telangana New Secretariat : హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. తెలంగాణ చరిత్రపుటలో మరో అద్భుత కట్టడం.. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే ముగియనుంది. ముఖ్యమంత్రి రాక మొదలు.. మంత్రులు, అధికారుల సంతకాల ప్రక్రియ మొత్తం.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుంచి 2 గంటల నాలుగు నిమిషాల్లోపే జరగనుంది. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.

TS Secretariat
TS Secretariat

Telangana New Secretariat : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ సౌధం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భవనం, ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి అలంకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో హోమశాల సిద్ధమైంది. సుదర్శన యాగం, చండీహోమం నిర్వహించనున్నారు. రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగంలో పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు సీఎంకు స్వాగతం పలుకుతారు.

Telangana New Secretariat Inauguration: ముందుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్న అనంతరం గ్రాండ్ ఎంట్రీ వద్ద ఏర్పాటు చేయనున్న ఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత కింది అంతస్థులో వాస్తుపూజలో సీఎం పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ఆరో అంతస్థుకు చేరుకుంటారు. సంప్రదాయ పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం మధ్య కుర్చీలో ఆసీనులవుతారు. వెంటనే ఒక ముఖ్యమైన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఒంటి గంట 33 నిమిషాలలోపు పూర్తి కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మండలి ఛైర్మన్, శాసన సభాపతి, మంత్రులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందిస్తారు.

గంటలోపే ప్రారంభోత్సవం పూర్తి..: సీఎం కేసీఆర్‌ తన కుర్చీలో కూర్చున్న తర్వాత.. మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే పూర్తి కానుంది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికే సమయంలో, ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించే సమయంలో, వాస్తుపూజ సమయంలో ఎక్కువ మంది ఉండకుండా చూస్తున్నారు. ఏకకాలంలో పూజలు జరిగేలా.. భారీ సంఖ్యలో రుత్విక్కులను భాగస్వామ్యం చేస్తున్నారు. వంద మంది రుత్విక్కులు క్రతువులో పాల్గొంటున్నారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

సీఎం సంక్షేమ సంతకం..: ఇదిలా ఉండగా.. సచివాలయ ప్రారంభోత్సవం వేళ సీఎం కేసీఆర్‌ పలు ప్రతిపాదనల దస్త్రాలపై సంతకం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేయనున్నారు. దళిత బంధు పథకం రెండో విడత విధి విధానాలనూ కేసీఆర్ ఆమోదించనున్నారు. వీటితో పాటు వివిధ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యా పథకం కింద నిధులు మంజూరు చేయనున్నారు. గృహ లక్ష్మి పథకం విధి విధానాల రూపకల్పనకూ సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు.

ఇవీ చూడండి..

TS Secretariat: కొత్త సచివాలయం డ్రోన్​ విజువల్స్.. అద్దిరిపోయాయంతే..!

TS New Secretariat: తెలంగాణ చరిత్రపుటలో మరో అద్భుత కట్టడం.. నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.