ETV Bharat / state

మళ్లీ మొదటికి వచ్చిన శ్రీశైలం, సాగర్‌ నిర్వహణ

author img

By

Published : Dec 6, 2022, 6:56 AM IST

Telangana letter to KRMB regarding Krishna waters
కృష్ణా జలాల వివాదం

Telangana letter to KRMB: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు, పవర్‌హౌస్‌ల నిర్వహణపై ఏకాభిప్రాయం కుదరలేదు. వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ-ఆర్​ఎంసీ లక్ష్యం నెరవేరలేదు. కమిటీ ముసాయిదా నివేదికపై ఆంధ్రప్రదేశ్‌ సంతకాలు చేయగా.. రాష్ట్ర ప్రతినిధులు గైర్హాజరయ్యారు. ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేఆర్​ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్రం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆర్​ఎంసీ నివేదిక అమలులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.

కృష్ణా జలాల విషయం కేఆర్​ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ

Telangana letter to KRMB: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ కోసం అవసరమైన విధానాలు రూపొందించేందుకు ఆరు నెలల క్రితం కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో కీలక అధికారిగా ఉన్న రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో ఆర్​ఎంసీ ఏర్పాటైంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. పవర్‌హౌస్‌ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత. శనివారం కమిటీ ఆరో సమావేశం నిర్వహించగా.. రెండు రాష్ట్రాల అధికారులు హాజరై ముసాయిదా నివేదికపై చర్చించారు. సోమవారం మళ్లీ సమావేశమై తుది ఆమోదం తెలపాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రతినిధులు గైర్హాజరయ్యారు. వారు లేకుండానే కమిటీ చర్చించింది. కమిటీలో ఆరుగురు సభ్యులుండగా.. నలుగురు ఆమోదం తెలిపి.. కేఆర్​ఎంబీకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ముసాయిదాలోను ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలంలో కనీస నీటి మట్టం జులై ఒకటి నుంచి అక్టోబరు 31 వరకు 854 అడుగులకు పైనే ఉండాలి. మిగిలిన సమయంలో విద్యుత్తు అవసరాలకు తగ్గట్లుగా దిగువన నీటిని తీసుకోవచ్చు. తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ 815 అడుగుల కంటే దిగువ నీటిని తీసుకోరాదు. రిజర్వాయర్ల నిర్వహణలో పవర్‌హౌస్‌లు కీలకమని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి ప్రయోజనాలు 50:50 నిష్పత్తిలో ఉండాలి. 75 శాతం నీటి లభ్యతకు మించి మిగులు జలాలు ఎంత ఉన్నాయనేది తేల్చడానికి స్పష్టంగా ఓ విధానాన్ని అనుసరించాలి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నిండి గేట్లు ఎత్తినపుడు తీసుకొనే నీటినే మిగులు జలాలుగా పరిగణిస్తారు. ఈ నీటిని ఏ రాష్ట్రం ఎంత మళ్లించిందని లెక్కల్లోకి తీసుకొంటారు.

ఆర్​ఎంసీ నివేదిక ఆమోదయోగ్యం కాదు: ఆర్‌ఎంసీ ముసాయిదా నివేదికలోని అంశాలు తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నివేదికను పక్కన పెట్టాలని కోరుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌కు.. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ లేఖ రాశారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చెరి సగం పంచుకోవాలని నివేదికలో ప్రస్తావించారని.. ఈ ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసి 280 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేసేందుకు శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించారని.. కృష్ణా జల వివాదాల మొదటి ట్రైబ్యునల్ కూడా దాన్ని సమర్థించిందని లేఖలో పేర్కొన్నారు.

ఏపీ పదేపదే నియమాలు ఉల్లంఘన: తెలంగాణలో ఉన్న అవసరాల రీత్యా వంద శాతం ఉత్పత్తి సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసిందని రజత్‌కుమార్‌ గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్​స్​ విషయంలోనూ తమ అభిప్రాయాన్ని గతంలోనే స్పష్టం చేశామని.. చెన్నైకి 15టీఎంసీలు, ఎస్సార్‌బీసీకి 19 టీఎంసీలు.. మొత్తంగా 34 టీఎంసీలకు మించి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తీసుకెళ్లరాదని తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ పదేపదే ఉల్లంఘిస్తోందన్నారు. ఆర్‌ఎంసీ నివేదికలో 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలనే అంశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీశైలం జలాశయం వద్ద కనీసం నీటిమట్టాన్ని 854 అడుగులు కాకుండా 830 అడుగులు కొనసాగించాలని తాము గతంలోనూ పలుమార్లు కోరిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

66:34 వినియోగం ఆమోదయోగ్యం కాదు: కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా భారీ మొత్తంలో తరలించుకునే వెసులుబాటు, నిలువ చేసుకునే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని.. ఇదే సమయంలో తెలంగాణ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. ఈ పరిస్థితుల్లో వరద సమయంలో జలాలను ఆయా రాష్ట్రాల కోటాలో లెక్కించకుండా పోతే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వరద తర్వాత శ్రీశైలం, సాగర్ నుంచి తెలంగాణ ఆ మేరకు జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటేనే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు తెలంగాణ అంగీకరించిందన్న మాట ఎంత మేరకు వాస్తవం కాదని.. చెరిసగం వినియోగించుకోవాలని మే నెలలోనే జరిగిన బోర్డు సమావేశంలో తమ అభిప్రాయం స్పష్టంచేశామని రజత్ కుమార్ గుర్తు చేశారు.

పది నుంచి 12 లక్షల ఎకరాల వరకు సాగునీరు ఇచ్చే ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టులకు 105 టీఎంసీల నీరు అవసరమని.. మొత్తంగా తెలంగాణకు కృష్ణాజిల్లాలో 575 టీఎంసీల అవసరాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అంగీకారం లేకుండా 66:34 నిష్పత్తికి బోర్డు ఇచ్చిన నోటీసు చెల్లుబాటుకాదని స్పష్టంచేశారు. కేటాయించిన మొత్తాన్ని ఏడాదిలో వాడుకోకుండా మిగిలిన నీటిని క్యారీ ఓవర్‌గా మరుసటి సంవత్సరానికి వినియోగించుకునేలా అనుమతి ఇవ్వాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నప్పటికీ బోర్డు సానుకూలంగా స్పందించడం లేదని రజత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్‌కు లోబడే తాము ఈ విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని అన్నారు. ఆర్ఎంసీ కమిటీ నివేదికలో ఈ అంశాలు ఏవి లేవని... సిఫారసులన్నీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ కమిటీ నివేదికను పక్కన పెట్టాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.