ETV Bharat / international

'కరోనా వైరస్‌ చైనా నిర్మితమే.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకయ్యింది'

author img

By

Published : Dec 5, 2022, 7:05 PM IST

Scientist
కొవిడ్‌-19

కరోనా వైరస్‌ విజృంభణకు కారణమైన కొవిడ్‌-19 వైరస్‌ మానవ నిర్మితమైందంటూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆయన పుస్తకంలో పేర్కొన్న విషయాలు సంచలనంగా మారాయి. వుహాన్‌ ల్యాబ్‌లో గతంలో పనిచేసిన ఆయన అందుకు సంబంధించిన వివరాలతో 'ది ట్రూత్ ఎబౌట్ వుహాన్' అనే పుస్తకంలో కీలక విషయాలు తెలిపారు. ఈ పుస్తకం ఆధారంగా అంతర్జాతీయ మీడియాలో కరోనాపై పలు కథనాలు వెల్లడయ్యాయి.

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌-19 మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఫలితం మాత్రం తేలలేదు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ మానవ నిర్మితమేనంటూ ప్రముఖ అమెరికన్‌ ఎపిడమాలజిస్ట్‌ ఆండ్రూ హఫ్స్‌ తన పుస్తకంలో సంచలన విషయాన్ని వెల్లడించారు. గతంలో వుహాన్‌ ల్యాబ్‌లో పనిచేసిన ఆయన అక్కడి నుంచే వైరస్‌ లీకయ్యిందంటూ వెళ్లడించారు. దీంతో అది చర్చనీయాంశమయ్యింది.

అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు ఆండ్రూ హఫ్స్‌ 'ది ట్రూత్ ఎబౌట్ వుహాన్' పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. అందులో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ- WIV నుంచే కొవిడ్‌ లీకయ్యిందని పేర్కొన్నారు. ‌అంతేకాకుండా వుహాన్ పరిశోధనలకు అమెరికా నుంచి నిధులు అందేవని రాశారు. ఆ పుస్తక సారాంశాన్ని బ్రిటన్‌కు చెందిన 'ది సన్‌' పత్రిక ప్రచురించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ది న్యూయార్క్‌ పోస్టు కూడా ఓ కథనాన్ని రాసింది. వైరస్‌లపై పరిశోధనలు జరిపే క్రమంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకయ్యిందని ఆండ్రూ హఫ్స్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది.

విదేశీ ల్యాబ్‌లలో బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అవసరమైన నియంత్రణ చర్యలు లేకపోవడం వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకవడానికి దారితీసిందని హఫ్స్‌ చెప్పినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది. కొవిడ్‌-19 జన్యుపరంగా తయారు చేసిందేనని చైనాకు మొదటినుంచీ తెలుసని అక్కడి పరిస్థితులు చూసి ఎంతో భయపడిపోయాని హాఫ్స్‌ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ప్రమాదకర జీవాయుధ సాంకేతికతను చైనాకు బదిలీ చేస్తున్నాం అని అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆండ్రూ అందులో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

అంటువ్యాధులపై అధ్యయనం చేసే స్వచ్ఛంద సంస్థ, న్యూయార్క్‌లోని ఎకోహెల్త్‌ అలయన్స్‌కు ఆండ్రూ హఫ్స్‌ 2014-16 మధ్య కాలంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై ఈ సంస్థ శతాబ్దానికి పైగా అధ్యయనం చేస్తోంది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ -NIH నిధులు సమకూర్చే ఈ సంస్థ చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేసింది. అయితే, కొవిడ్‌ బయటపడిన సమయంలో వుహాన్‌ ల్యాబ్‌పై ఎన్నో ఆరోపణలు రావడంతో ట్రంప్‌ హయాంలో దానికి నిధులను నిలిపివేశారు.

ఇవీ చదవండి: శాంతించని 'మౌనా లోవా'.. 25 అడుగులు ఎగసిపడుతున్న లావా.. టూరిస్ట్​ల సెల్ఫీలు

ఇరాన్ 'హిజాబ్'​ వివాదంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నైతిక పోలీసు వ్యవస్థ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.