ETV Bharat / state

'సామాన్యుడికి న్యాయం చేకూరాలంటే ఈ రెండు విషయాలు చాలా కీలకం'

author img

By

Published : Apr 15, 2022, 10:12 PM IST

'దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే.. తెలంగాణ హైకోర్టు నాకు చాలా నేర్పింది'
'దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే.. తెలంగాణ హైకోర్టు నాకు చాలా నేర్పింది'

CJI Justice NV Ramana: దేశంలో న్యాయ వ్యవస్థ పటిష్ఠానికి కోర్టులు సామాన్యుడికి అందుబాటులో ఉండటం.. అందులో మౌలిక వసతులు ఉండటం.. ఈ రెండు విషయాలు కీలకమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇందుకోసం తన సాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే సంతోషించేవాడిలో తానూ ఒకడినంటూ స్పష్టం చేశారు.

CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టులో తొలిసారి సన్మానం జరిగింది. నాలుగు రోజుల సెలవులో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయనను తెలంగాణ బార్‌ కౌన్సిల్, అడ్వకేట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆయనను హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్​ చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. సన్మానానికి ముందు హైకోర్టులో కలియదిరిగిన సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ భావోద్వేగానికి లోనయ్యారు. 11ఏళ్ల పాటు పలు హోదాల్లో అక్కడ పనిచేసిన ఆయన.. అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేనన్న సీజేఐ... హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉందన్నారు. న్యాయవాదిగా ఉన్ననాటి రోజులు.. కేసులు లేనపుడు ఖాళీగా కూర్చున్న రోజులు, అప్పట్లో సిద్దయ్య క్యాంటీన్​లో టీ తాగిన రోజులు ఇవాళ నెమరువేసుకున్నారు. హైకోర్టు నుంచి ఎంతో నేర్చుకున్నానన్న ఆయన.. రుణం తీర్చుకునేందుకు శ్రమిస్తానన్నారు.

రెండు విషయాలు చాలా కీలకం.. ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత సామాన్యుడికి న్యాయం చేకూరడానికి రెండు విషయాలు చాలా కీలకమని గమనించినట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కోర్టులు అందుబాటులో ఉండటం, వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా కీలకమన్నారు. ఇందుకోసం జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే తరువాయి అన్నారు. మరో వైపు జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటంతో సామాన్యుడికి సత్వర న్యాయం జరగడం లేదని.. అందుకే జడ్జిల నియామకానికి పెద్దపీట వేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1100 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని... ఇంకా 400 ఖాళీలు ఉన్నాయన్నారు. మే నెలాఖరు వరకూ మరో 200 మంది జడ్జిల నియామకం పూర్తి అవుతుందని వెల్లడించారు. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జిలు ఉంటే ఆ సంఖ్యను 42 చేశామని గుర్తుచేశారు. ఇంకా మరి కొన్ని ఖాళీలు ఉన్నాయని.. ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం మెంబర్లు పేర్లు సూచిస్తే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

న్యాయవాదులను ఆదుకోవాలి.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారన్న ఆయన.. సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తనతో చెప్పారన్నారు. కొన్ని కోర్టులకు కూడా కొత్త భవనాలు నిర్మిస్తున్నామని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని.. కొందరు వృత్తినే మానేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. కొవిడ్ వల్ల వారు ఎంతో నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. సీనియర్ న్యాయవాదులు వారిని పెద్ద మనసుతో ఆదుకోవాలని సూచించారు. న్యాయవాదులకు శిక్షణ కోసం అకాడమీ అవసరం ఉందన్న సీజేఐ.. కొత్తగా వృత్తిలోకి వచ్చిన న్యాయవాదులకు వసతి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందు కోసం శ్రమిస్తామన్నారు.

సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.. తన మొదటి ఆలోచన హైదరాబాద్ మీదనే ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు. హైదరాబాద్​లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో సుప్రీం కోర్టు ఆల్ ఇండియా జ్యుడీషియల్ డేటా మేనేజ్​మెంట్ సెంటర్​ను ఏర్పాటు చేయాలని భావించామని.. దీనిని హైదరాబాద్​లో ఏర్పాటు చేయాలని సూచించినట్లు వివరించారు. అది ఏర్పాటైతే హైదరాబాద్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. నేషనల్ అప్పీలేట్ ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిని కోరామని.. అందుకు ప్రతిపాదనలు పంపితే మన ప్రాంతానికి చెందిన కంపెనీలు వృద్ధి చెందుతాయన్నారు. అడ్వొకేట్లు సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. చిన్ని చిన్న విషయాలకు ఫిర్యాదులు చేసుకోవద్దని సూచించారు.

ఆయన కృషి అభినందనీయం.. భారత న్యాయవ్యవస్థపై సీజేఐకి ఉన్న ఆసక్తి, చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ అన్నారు. చేస్తున్న సంస్కరణలు ఇందుకు అద్దం పడుతున్నాయని కొనియాడారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంతటి గొప్ప స్థానానికి ఎదగడం చాలా గొప్ప విషయమని తెలంగాణ బార్ అసోసియేషన్ ఛైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తీర్పులో నాణ్యత ఉండేలా ఎన్నో చర్యలు చేపట్టారని... సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాక ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.