ETV Bharat / state

ts high court: 'ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించండి'

author img

By

Published : Aug 4, 2021, 3:37 PM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టి నిర్ణీత వ్యవధిలో భూముల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని న్యాయస్థానం పేర్కొంది.

government lands
government lands

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టు దృష్టిసారించింది. ప్రభుత్వ భూముల్లో అవకతవకలు తమ దృష్టికి వస్తున్నాయన్న హైకోర్టు.. 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వ భూములను జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని.. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపించాలని.. రికార్డులోని ప్రభుత్వ భూములను సర్వే చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించాలని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లకు అనుమానం వస్తే ముందుగా కలెక్టర్లను సంప్రదించాలని సూచించింది. ప్రభుత్వ భూముల సర్వే, వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను వారం రోజుల్లో కలెక్టర్లకు పంపించాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ అక్టోబరు 27కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: TS High Court: కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్లా?.. హైకోర్టు సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.