ETV Bharat / state

సేంద్రీయ సేద్యంపై.. సర్కారు ప్రత్యేక దృష్టి!

author img

By

Published : Sep 8, 2020, 2:45 PM IST

రాష్ట్రంలో సేంద్రీయ సేద్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరగడం వల్ల రసాయన ఎరువుల వినియోగం సైతం అదే స్థాయిలో పెరగడం ఒకింత కలవరం కలిగిస్తోంది. ఎరువుల వాడకం హేతుబద్ధంగా ఉండేలా రైతులను సమాయత్తం చేస్తూ సేంద్రీయ ఎరువుల వినియోగం ప్రోత్సహించేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో "తెలంగాణ సిరి" పేరిట సిటీ కంపోస్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఉత్పాదనను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ భూసారం, నీరు, పర్యావరణహితం దృష్ట్యా తక్కువ ధరల్లో సేంద్రీయ ఎరువుల సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Telangana Government Develops Siti Compost For FarmingTelangana Government Develops Siti Compost For Farming
సేంద్రీయ సేద్యంపై.. సర్కారు ప్రత్యేక దృష్టి!

రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల విధానాలు అమలవుతున్న వేళ సాగు ఖర్చులు తగ్గింపుపై సర్కారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెట్టుబడి ఖర్చు పెరగడం వల్ల రసాయన ఎరువుల వాడకం కీలకంగా మారింది. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయిలో రైతులు విచక్షణారహితంగా ఎరువుల వాడకం పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా రైతుల్లో ఎరువుల క్రమబద్ధీకరణ, సేంద్రీయ, ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రంగం సిద్ధమైంది. సహజ పెట్టుబడి లేని వ్యవసాయం వంటి విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్నందున భూసారం, నీరు, పర్యావరణం, జీవవైవిధ్యం పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రసాయన అవశేషాలు లేని వ్యవసాయ, ఉద్యానోత్పత్తుల లక్ష్యంగా సేంద్రీయ సేద్యం రైతుల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది.

తక్కువ ధరకే ఎరువు అందించేలా..

తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో "తెలంగాణ సిరి" పేరిట సిటీ కంపోస్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బేగంపేట ది ప్లాజా హోటల్ వేదికగా పంటల పాలిట కల్పతరువు... తెలంగాణ సిరి సిటీ కంపోస్‌ బ్రాండ్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. రైతుల సౌకర్యార్థం 600 ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా 50 కిలో బస్తాను తక్కువ రేట్లపై విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసే క్రమంలో యాంత్రీకరణ వినియోగం, లాభాలు ఆశించకుండా సేంద్రీయ ఎరువుల వాడకం రైతుల్లో విస్తృతం చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు..

వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర,రాష్ట్రాలు వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తున్న తరుణంలో పెట్టుబడులు తగ్గించి లాభసాటిగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. తెలంగాణ సిరి సేంద్రీయ ఎరువులకు బహుళ ప్రాచుర్యం కల్పించడం ద్వారా సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు శాస్త్రీయ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఏటా 6వేల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు, 4 వేల టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరల వ్యర్థాలు వస్తుండగా... ఇందులోంచి ఇప్పటికే రాంకీ, భవానీ బయో ప్రైవేటు లిమిటెడ్ లాంటి సంస్థలు సిటీ కంపోస్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద మున్సిపల్ వ్యర్థాలు, సూక్ష్మ జీవులను ఉపయోగించి 28 నుంచి 32 రోజుల వ్యవధిలో చక్కటి సేంద్రీయ ఎరువుల తయారు చేసి పట్టణవాసులతో పాటు.. రైతులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. సేంద్రీయ ఎరువులు వ్యవసాయ ఉత్పాదన, పండ్లు, కూరగాయల తోటల పెంపకంలో ప్రధాన భూమిక పోషిస్తున్నందున మరింతగా ఈ ఎరువు వాడకాన్ని విస్తృతపరిచేందుకు రాంకీ, భవానీ బయో సంస్థలతో టీఎస్ ఆగ్రోస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు బస్తాలు రసాయన ఎరువులు వాడే రైతులు ఇక నుంచి విధిగా సగ ఎరువు సేంద్రీయ ఎరువులు జోడించాలని సుప్రీంకోర్టు, పార్లమెంటరీ స్థాయి కమిటీ స్పష్టం చేసిన దృష్ట్యా... ఆ దిశగా రైతులను ప్రోత్సహించనున్నట్లు రాంకీ ప్రతినిధులు తెలిపారు.

రసాయన నష్టాల నుంచి బయటపడాలి..

రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. హరిత విప్లవం నేపథ్యంలో 40 నుంచి 45 ఏళ్ల తర్వాత వ్యవసాయ రంగం సమీక్షించిన పిదప మనం సాధించిన సత్ఫలితాలతోపాటు దుష్ఫలితాలు కూడా అధికంగానే ఉన్నాయి. రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులు విచక్షణారహితంగా ఉపయోగించడం, వ్యవసాయ యంత్ర పరికరాలు వాడటం వల్ల పలు అనర్థాలకు దారితీసింది. పీల్చే గాలి, తాగేనీరు, తీసుకునే ఆహారం, నివసించే మనుషులు, జంతువుల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. వ్యవసాయ ఉత్పాదకత నానాటికి తగ్గిపోయి సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోతుండటంతో సాధించిన ప్రగతి కన్నా నష్టాలే అధికంగా ఉన్నాయి. ఈ వ్యవసాయ, ఉద్యానోత్పత్తుల్లో క్రిమిసంహారక అవశేషాలు పరిమితికి మంచి ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో అమెరికా, యూరప్, దుబాయ్ లాంటి దేశాలకు ఎగుమతులు నిరాకరించబడుతున్నాయి. దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి సమగ్ర ఎరువుల వాడకం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ప్రవేశపెట్టడం అత్యంత ఆవశ్యకం. ఇక నుంచి తాము విత్తనం, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, పనిముట్లతోపాటు సేంద్రీయ ఎరువులు దుకాణాల్లో విక్రయిస్తూ... రైతులను ప్రోత్సహిస్తామని ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులు చెప్పారు.

పడిపోతున్న సేంద్రీయ పదార్థం..

రాష్ట్రంలో భూసార పరీక్షా పలితాలు విశ్లేషణల్లో 70 శాతం నేలలో సేంద్రీయ పదార్థం 0.4 శాతం పడిపోయినట్టు తేలింది. కనీసం 1.3 నుంచి 2 శాతం సేంద్రీయ పదార్థం భూమిలో ఉన్నట్లైతే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుబాటులోకి వస్తాయి. నేలలో అనుకూల భూభౌతిక లక్షణాలు ఏర్పడి ఆశించిన ఫలితాలు పొందడానికి వీలవుతుంది. సుస్థిర వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు, సేంద్రీయ ఎరువులు కీలక భూమిక పోషిస్తాయి. 1950 వరకు రాష్ట్ర రైతాంగం సేంద్రీయ ఎరువులపై ఆధారపడి వ్యవసాయం చేశారు. ఎంతో ఉపయోగంగా ఉన్నా రానురాను వీటి వినియోగం తగ్గిపోయింది. నేలల్లో తగినంత సేంద్రీయ పదార్థం లేకపోవడం వల్ల భూమి నిస్సారమవుతోంది. ఈ నేపథ్యంలో సేంద్రీయ ఎరువుల వాడకంలో విప్లవం తీసుకొచ్చేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, స్పిక్, క్రిబ్కో, ఆర్‌సీఎఫ్‌, మల్టీపెక్స్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ లాంటి కంపెనీలు రాష్ట్రంలో 45 వేల టన్నుల సిటీ కంపోస్ట్ విక్రయిస్తున్నాయి. నోడల్ ఏజెన్సీగా వ్యవహిస్తున్న దృష్ట్యా... ఇక నుంచి టీఎస్ ఆగ్రోస్ ఆదేశాల మేరకు ఆయా కంపెనీలు తెలంగాణ సిరి సిటీ కంపోస్ట్ విక్రయించాల్సి ఉంటుందని ఆ సంస్థ ఎండీ రాములు తెలిపారు. నేల భూభౌతిక లక్షణాలు మెరుగుపరిచే ఈ సేంద్రీయ ఎరువులు... సూక్ష్మజీవుల జీవన చర్యల వల్ల నేలలు గుల్లబారి వేర్లు పెరగడానికి దోహదపడతాయి. బహుళ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని యువత, యువ రైతులు, ఔత్సాహిక మహిళలు ముందుకు వస్తే... తెలంగాణ సిరి సిటీ కంపోస్ట్ అవుట్‌లెట్లు ఇవ్వడానికి టీఎస్ ఆగ్రోస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం విశేషం.

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.