జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం - ఆ 18 నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్

జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం - ఆ 18 నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్
Telangana Congress Speed up In Election Campaign : అధికారమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్... వారం రోజుల్లో దాదాపు 70 నియోజకవర్గాలలో ప్రచారం చెయ్యాలని నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు మల్లికార్జున ఖర్గే ఇతర ఏఐసీసీ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు బలహీనంగా ఉన్న 20కిపైగా నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సాధించింది. ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్లడం, బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
Telangana Congress Speed up In Election Campaign : రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఎక్కుపెడుతున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులు ఏఐసీసీ ప్రతినిధులు కేసీఆర్, కేటీఆర్ విమర్శలపై ఎదురు దాడి చేస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొదటిసారి సర్వేలు చేసిన కాంగ్రెస్.. సునీల్ కనుగోలు టీం నియోజకవర్గాల వారీగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను దాదాపు 25 నియోజకవర్గాల్లో పార్టీ ఆశించినంత బలంగా లేనట్లు సర్వేలు స్పష్టం చేశాయని సమాచారం.
ప్రధానంగా నియోజకవర్గాలల్లో పార్టీ ,అభ్యర్థుల బలాబలాలను మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీలకు (Congress Six Guarantees) సంబంధించి అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు 25 నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనాయకుల ప్రచారంతోపాటు ఇంటింటికీ కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto), 6 గ్యారంటీలను చేరవేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Congress Top Leaders Election Campaign : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్(Rahul Gandhi) , ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కలిసి ఇప్పటివరకు 50 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ 50 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 30 నియోజకవర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మిగిలిన మరో 69 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ 69 నియోజకవర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 20 వరకు ప్రచారం చేయనుండగా మిగిలిన 39 నియోజకవర్గాల్లో రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రముఖులు ప్రచారం నిర్వహించనున్నారు.
Telangana Congress Campaign Today : ఈ మేరకు పీసీసీ స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న దాదాపు 25 నియోజకవర్గాలలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎంఐఎం పార్టీ (MIM Party) బలంగా ఉండే 7 నియోజకవర్గాలు పక్కన పెడితే మిగిలిన 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏఐసీసీ పరిశీలకులు ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను అంచనా వేసుకోవడంతో పాటు ప్రచార సామాగ్రిని ఇంటింటికి చేరవేసే యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం సూచించింది.
పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకుల మధ్య విభేదాలు సమసిపోయేటట్లు చేయడంతోపాటు కలిసికట్టుగా పనిచేసే వాతావరణం సృష్టించడమే పరిశీలకులు చేయాల్సిన కీలకమైన పనిగా పార్టీ పేర్కొంటోంది. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆలంపూర్ నల్లగొండలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రియాంక గాంధీ 24, 25 తేదీల్లో రెండు రోజులు ఆరు సభల్లో పాల్గొని ప్రచారం చేస్తారు. 25వ తేదీన ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్లనున్న ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).. తిరిగి 27న రాష్ట్రానికి వచ్చి మూడు నియోజకవర్గాల్లోని ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
