Trs Bhavan in Delhi: మరో కీలక ఘట్టానికి నాంది... దిల్లీలో తెరాస భవనానికి భూమిపూజ

author img

By

Published : Sep 2, 2021, 1:56 PM IST

Updated : Sep 2, 2021, 9:27 PM IST

Trs Bhavan in Delhi
Trs Bhavan in Delhi ()

రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితిలో మరో కీలక ఘట్టానికి పునాది పడింది. దిల్లీలో తెరాస కార్యాలయ భవనానికి గులాబీ అధిపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భూమి పూజ నిర్వహించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న ఆచార్య జయశంకర్ మాట స్ఫూర్తిగా.. దిల్లీ గడ్డపై గులాబీ పతాకం రెపరెపలాడటం ప్రతీ తెలంగాణ బిడ్డకు భరోసా ఇస్తుందని.. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు.

దేశ రాజధాని దిల్లీలో తెరాస కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒంటిగంట 48 నిమిషాలకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇతర నేతలు నిన్ననే దిల్లీకి చేరుకున్నారు. గతేడాది అక్టోబరు 9న దిల్లీ వసంత విహార్ వద్ద తెరాసకు 1,100 చదరపు మీటర్ల భూమిని కేటాయించిన కేంద్రప్రభుత్వం... గతేడాది నవంబరు 4న తెరాసకు కేంద్రం భూమిని అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా వేచి ఉన్న తెరాస.. ఇవాళ మంచి ముహూర్తంగా భావించి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

దిల్లీ గడ్డపై గులాబీ పతాకం..

దిల్లీలో తెరాస భవనం తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి చిహ్నమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఊపిరిపోసుకున్న తెరాస.. నేడు దిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజచేయడం చారిత్రక ఘట్టమని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమం, తెరాస పార్టీ.. చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుందని కేటీఆర్​ అన్నారు. సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో తెరాస ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని.. అనేక అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగిందని గుర్తుచేశారు. ఏడేళ్ల స్వయం పాలనలో, కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని వివరించారు.

తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ.. ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుంచి మహత్తరమైన పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న ఆచార్య జయశంకర్ మాట స్ఫూర్తిగా.. దిల్లీ గడ్డపై గులాబీ పతాకం రెపరెపలాడటం ప్రతీ తెలంగాణ బిడ్డకు భరోసా ఇస్తుందని తెలిపారు. దిల్లీలో కార్యాలయం ఏర్పాటుచేసిన రెండో ప్రాంతీయ పార్టీగా తెరాస నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా...

తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఏడాదిలోగా పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు చేసింది. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ... దిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణం కీలక మైలురాయిగా భావిస్తోంది. దిల్లీ కేంద్రంగా భవిష్యత్తు రాజకీయాలకు ఇది నాందిగా తెరాస శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.

పార్టీ జెండా పండగ...

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ జెండా పండగను తెరాస శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా పార్టీ జెండా ఎగరవేస్తున్నారు. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. జెండా పండగ, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జెండా పండగ పూర్తి కాగానే.. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం మొదలు కానుంది. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 51శాతం ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మహిళలకు తగిన స్థానం కల్పించాలని స్పష్టం చేశారు.

దిల్లీలో తెరాస కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం

ఇదీ చదవండి: CM KCR DELHI TOUR: దిల్లీకి చేరుకున్న కేసీఆర్​.. రెండు రోజుల పాటు బిజీబిజీ!

Last Updated :Sep 2, 2021, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.