ETV Bharat / state

TS Cabinet Meeting Decisions 2023 : గవర్నర్​ తిరస్కరించిన బిల్లులు మళ్లీ సభలోకి.. రెండోసారి ఆమోదించి పంపాలని నిర్ణయం

author img

By

Published : Aug 1, 2023, 7:26 AM IST

Telangana
Telangana

Telangana Cabinet Meeting Decisions : ప్రజా రవాణాకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.. రూ.69,000 కోట్ల వ్యయంతో మెట్రో రైల్ భారీ విస్తరణ, మామునూరు విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణకు కేబినేట్ తీర్మానించింది. భారీ వర్షాల కారణంగా పది జిల్లాల్లో జరిగిన నష్టానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించిన మంత్రివర్గం.. పంటనష్టంపై సమగ్ర నివేదిక అందించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేసిన కేబినెట్.. గవర్నర్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులను మళ్లీ ఆమోదించి పంపాలని నిర్ణయించింది.

50కి పైగా అంశాలకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదముద్ర

Telangana Cabinet Takes Major Decisions : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా.. ఐదు గంటలకు పైగా సమావేశం అయింది. భారీ ఎజెండాలో దాదాపు 50కి పైగా అంశాలపై ఆమోద ముద్ర వేసింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై విస్తృతంగా సమీక్షించింది. వరదల పరిస్థితి జరిగిన నష్టాన్ని విపత్తు నిర్వహణ, వ్యవసాయ, ఆర్అండ్‌బీ శాఖలు.. మంత్రివర్గానికి నివేదించాయి.

ఎక్కువగా నష్టం జరిగిన 10 జిల్లాలకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించింది. దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఇద్దరు విద్యుత్ శాఖ సిబ్బందికి, ఆశ్రమ పాఠశాల సిబ్బంది ఒకరికి ప్రత్యేక అభినందనలు తెలిపిన కేబినెట్.. ఆగస్టు 15న ప్రత్యేకంగా సన్మానించాలని నిర్ణయించింది.

Telangana Cabinet Meeting Decisions : ఖమ్మంలో మున్నేరు ఒడ్డున ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణాన్ని ఆమోదించిన మంత్రివర్గం.. పొలాల్లో ఇసుక మేటలు, అన్నింటినీ పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్న మంత్రి కేటీఆర్.. కేంద్రం రాజకీయం చేయకుండా సాయం చేయాలని కోరారు.

"దాదాపు పది జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎక్కువగా నష్టం జరిగింది. అందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. వరదల్లో దాదాపు 27,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం. వరదల్లో 40 మంది చనిపోయారు. వారికి ఎక్స్‌గ్రేషియా అందజేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది." - కేటీఆర్, మంత్రి

Cabinet Decides TSRTC Merge with Government : ఆర్టీసీ విషయమై కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్... కార్మికులకు శుభవార్త అందించింది. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించి.. విధివిధానాల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేసింది. వచ్చే సమావేశాల్లోనే సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం 250 ఎకరాల భూమి ఇచ్చేందుకు తీర్మానించింది. విస్తరణ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్ ఉత్తరాన ఉన్న హకీంపేట ఎయిర్‌పోర్టును.. పుణె, గోవా తరహాలో పౌర విమానయానం కోసం కూడా ఉపయోగించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు. రూ.60,000 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ భారీ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మూడు, నాలుగేళ్లలో మెట్రో రైల్‌ను పెద్ద ఎత్తున విస్తరించాలని నిర్ణయించింది. మెట్రో విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నామన్న కేటీఆర్ .. లేదంటే తామే చేపడతామని చెప్పారు. 2024 తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు.

TS Cabinet Meeting Decisions : కొత్తగా 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న తొలి రాష్ట్రంగా.. తెలంగాణ నిలవనుందని ప్రకటించింది. ఆయా కళాశాలల్లో పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ విధానంలో టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, మహబూబాబాద్‌లో ఉద్యాన కళాశాలకు ఆమోదముద్ర వేసింది. రూ.1800 కోట్లతో నిమ్స్‌లో మరో 2,000 పడకలతో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలోనే 6,000 మంది బీడీ టేకేదారులకు కూడా ఆసరా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేయకుండా వెనక్కి పంపిన అన్ని బిల్లులను ఉభయసభల్లో మళ్లీ ఆమోదించి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో మారు పంపాక చేశాక ఆమోదించక తప్పదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Satyanarayana and Dasoju Sravan Elected MLC candidates : ప్రభుత్వమే తల్లి, తండ్రిగా ఉండేలా చిల్డ్రన్ ఆఫ్ స్టేట్‌గా గుర్తించి.. అనాథ పిల్లల సంరక్షణ సర్కార్‌పై ఉండేలా విధాన రూపకల్పనకు మంత్రివర్గం నిర్ణయించింది. తదుపరి కేబినెట్ సమావేశంలో విధానాన్ని ఆమోదించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మంత్రివర్గం పేర్లను ఖరారు చేసింది. ఎరుకల సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీసీ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లను ఆమోదించిన కేబినెట్ గవర్నర్‌కు సిఫారసు చేయనుంది.

ట్రాన్స్‌కో రూ.5,000 కోట్ల రుణం తీసుకునేలా ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్.. దక్షిణ భారత కాపు కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు కోసం ఖానామెట్‌లో స్థలం కేటాయించేందుకు తీర్మానించింది. గతంలో ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో ప్రభుత్వ భూముల విక్రయ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. కొన్ని కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇవీ చదవండి : Telangana Cabinet Meeting To Day : శాసనమండలికి గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. కేబినేట్ నిర్ణయం

Moranchapalli Floods Latest News : ఊహకు అందని నష్టం.. మాటల్లో చెప్పలేని విషాదం.. ఇంకా తేరుకోని మోరంచపల్లి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.