ETV Bharat / state

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు - నేడు విద్యుత్‌ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 8:06 AM IST

Telangana assembly meetings tomorrow
Telangana assembly meetings tomorrow

Telangana Assembly Sessions 2023 From Tomorrow : రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్​ను ఎన్నుకుంటారు. మరోవైపు నేడు విద్యుత్‌ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు.

Telangana Assembly Sessions 2023 From Tomorrow : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన శాసనసభను రేపు సమావేశపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మూడో శాసనసభ కోసం జరిగిన ఎన్నికల ఫలితాలు ఈనెల 3న వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకొంది. బీజేపీ 8 మజ్లిస్ 7, సీపీఐ పార్టీ ఒక స్థానంలో గెలుపొందాయి.

ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణ రెండో శాసనసభ మూడో తేదీ మధ్యాహ్నం రద్దైంది. ఈ మేరకు ఈనెల 4న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆ వెంటనే అసెంబ్లీ ఏర్పాటైంది. రాష్ట్ర మూడో శాసనసభకు ఎన్నికైన సభ్యులపేర్లని నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీని రేపట్నుంచి సమావేశపర్చాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం కంటె ముందే ప్రొటెం స్పీకర్‌ని నియమించాల్సి ఉంటుంది.

హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి - రజినీ ఉద్యోగ దస్త్రంపై రెండో సంతకం

ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ ఒకరిని ప్రొటెంస్పీకర్‌గా గవర్నర్ నియమిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) 8 సార్లు ఎన్నిక కాగా, ఇతర సభ్యుల్లో పోచారం శ్రీనివాస్​రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దానం నాగేందర్‌ ఆరుసార్లు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరుసార్లు ఎన్నిక కాగా వారిద్దరు మంత్రులుగా ఉన్నారు. ఎంఐఎంకి చెందిన అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆరుసార్లు శాసనసభ ఎన్నికయ్యారు. వారిలో ఎవరినీ ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Telangana MLA Oath Taking in Assembly Tomorrow : ప్రొటెం స్పీకర్‌చే రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభాపతి ఎన్నిక చేపడతారు. కొత్త అసెంబ్లీ తొలిసారి సమావేశం అవుతున్న తరుణంలో ఉభయసభల సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. సభాపతి ఎన్నిక అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారన్న విషయమై స్పష్టత వస్తుంది.

CM Revanth Reddy Review On Power Sector Today : మరోవైపు తెలంగాణలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) నేడు సమీక్షించనున్నారు. గురువారం జరిగిన తొలి కేబినేట్ సమావేశంలో కరెంట్ అంశంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ట్రాన్స్​కో అధికారులపై సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టేందుకు ప్రయత్నించడం క్షమించరాని నేరమని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం - ముఖ్యమంత్రిగా ఆరు గ్యారంటీల దస్త్రంపై రేవంత్​ రెడ్డి తొలి సంతకం

ట్రాన్స్‌ కో జెన్‌ కో సీఎండీ రాజీనామా ఆమోదించవద్దు : విద్యుత్ సంక్షోభాన్ని తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈరోజులోగా అన్ని వివరాలతో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. నేటి సమీక్షకు సీఎండీగా పనిచేసిన ప్రభాకర్ రావు కూడా హాజరయ్యేటట్లు చూడాలని స్పష్టం చేశారు. ట్రాన్స్‌ కో జెన్‌ కో సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దని రేవంత్​రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రెవెన్యూ గ్రామంగా అక్కంపేట : మరోవైపు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపూర్ గ్రామంలో భాగంగా ఉన్న అక్కంపేటను ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ప్రతిపాదించారు. అభ్యంతరాలు, వినతులకు పక్షంరోజులు గడువు ఇచ్చారు.

కుమురం భీం పుట్టినగడ్డ ఇంద్రవెల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉన్న స్మృతివనం, సుందరీకరణ, అభివృద్ధికి ఎకరం భూమి కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు ఇంద్రవెల్లి-బీ గ్రామం 240 నంబర్ సర్వే నంబర్‌లో ఎకరం భూమిని కేటాయించారు. సుందరీకరణ, అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను, సీఎం ఆదేశించారు.

ముగిసిన కేబినెట్ భేటీ- విద్యుత్‌ సెక్రటరీపై సీఎం సీరియస్

సచివాలయంలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి - ఘనస్వాగతం పలికిన ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.