ETV Bharat / state

కేసీఆర్​కు వీడ్కోలు విందు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చింది: తరుణ్​చుగ్‌

author img

By

Published : Apr 5, 2023, 5:46 PM IST

Tarun chugh on Bandi Sanjay Arrest
Tarun chugh on Bandi Sanjay Arrest

Tarun Chugh Comments on KCR: రాష్ట్రంలో బండి సంజయ్​ అరెస్టుతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విషయంపై తరుణ్​చుగ్ స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్​ని ప్రభుత్వం అరెస్ట్​ చేసిందని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్‌కు వీడ్కోలు విందు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చింది: తరుణ్​చుగ్‌

Tarun Chugh Comments on KCR: అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్న ఆయన.. చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ వెనక బీజేపీతోపాటు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న విషయాన్ని బీఆర్ఎస్​ సర్కార్ మర్చిపోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌కు వీడ్కోలు విందు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చిందని తరుణ్​చుగ్ ఆరోపించారు .

రేపు సామూహిక ప్రతిజ్ఞలు చేయాలి: ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలతో తరుణ్​చుగ్​ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా రేపు సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్​ఎస్ ప్రభుత్వం పెట్టే కేసులు, అరెస్టులకు భయపడవద్దని.. పోరాటాలకు కార్యకర్తలను సిద్ధం చేస్తూ.. ఈ ప్రతిజ్ఞలు ఉంటాయని పేర్కొన్నారు. అదే విధంగా రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పోలింగ్ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతారని తరుణ్​చుగ్​ తెలిపారు.

"అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్‌ కుటుంబం.. మద్యం మాఫియా, కార్పొరేట్‌ పన్నులు, దళితులపై దాడులు, యువతులపై అత్యాచారాలు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌, పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ నుంచి అందరి దృష్టి మరల్చేందుకు.. డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోంది. ఆ డైవర్షన్‌ రాజకీయాల్లో కేసీఆర్‌ కుటుంబం మొత్తం.. ఒకే రకమైన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేశారు. వారు చేసిన తప్పులు, చేసిన చెడ్డపనుల నుంచి బయటపడేందుకు తప్పుడు, ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ అరెస్టులు చేస్తున్నారు. పేపర్‌ లీకేజీ విషయంలో మంత్రితోపాటు, సీఎం రాజీనామా చేయాల్సిందే. మీరు చేస్తున్న దమనకాండ ఎప్పటికీ సఫలం కాదు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజస్వామ్యం విజయం సాధించే వరకు ఎటిపరిస్థితుల్లో పోరాటాన్ని ఆపేది లేదు". -తరుణ్​చుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ

అసలేం జరిగిదంటే: బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్‌లో నిన్న అర్ధరాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నడుమ..ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బండి సంజయ్ అరెస్ట్​ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.