ETV Bharat / state

ఎంపీ నామ నాగేశ్వరరావు ఈడీ కేసుపై హైకోర్టు యథాతథ స్థితి

author img

By

Published : Feb 3, 2023, 5:48 PM IST

Updated : Feb 3, 2023, 8:01 PM IST

hc
hc

17:35 February 03

ఎంపీ నామ నాగేశ్వరరావు ఈడీ కేసుపై హైకోర్టు యథాతథ స్థితి

High Court on Nama Nageshwar Rao Case: బీఆర్​ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో యథాతథస్థితి కొనసాగించాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్​ల పేరిట బ్యాంకును మోసం చేశారన్న కేసులో ఈడీ అధికారులు నామ నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు చేసి ప్రశ్నించడంతో పాటు.. పలు ఆస్తులను తాత్కాలిక జప్తు చేశారు. ఈడీ కేసు, ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ నామ నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నామ నాగేశ్వరరావు వాదన. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌, ఛార్జ్‌షీట్లలోనూ పేరు లేదని.. మధుకాన్ గ్రూప్ సంస్థలకు తాను 2009లోనే రాజీనామా చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. వేధించడం కోసం దురుద్దేశ పూరితంగా ఈడీ కేసు పెట్టినట్లు తెలిపారు. నామ నాగేశ్వరరావు పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఈడీ గడువు కోరింది. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం మార్చి 3కి విచారణ వాయిదా వేసి.. అప్పటి వరకు స్టేటస్ కొనసాగించాలని స్పష్టం చేసింది.

ED attached Nama Nageshwar Rao properties: బీఆర్​ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న రూ.80 కోట్ల 65 లక్షల విలువైన ఆస్తులను ఈడీ గత సంవత్సరం అటాచ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది నామ నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపి.. రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. నామ నాగేశ్వరరావుతో పాటు పలువురిని ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. నామ నాగేశ్వరరావు బంధువు శ్రీనివాసరావును గతంలో ఈడీ అరెస్టు చేసింది.

మధుకాన్ గ్రూపునకు చెందిన రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ లిమిటెడ్​పై గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. రాంచీ నుంచి జంషెడ్​పూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ కాంట్రాక్టు 2011లో మధుకాన్​కు దక్కింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం కమ్మ శ్రీనివాసరావు, నామ సీతయ్య, నామ పృథ్వీ డైరెక్టర్లుగా రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణం కోసం వివిధ బ్యాంకుల నుంచి రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ పేరిట రూ.1,080 కోట్ల రుణాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. నామ నాగేశ్వరరావు మధుకాన్ ప్రమోటర్​గా రుణాలకు పూచీకత్తు ఉన్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే రుణం సొమ్మును రహదారి నిర్మాణం కోసం కాకుండా ఇతర వ్యాపారాలు, చెల్లింపుల కోసం మళ్లించడంతో పాటు తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఈడీ అభియోగం.

బోగస్ కాంట్రాక్టులు, బిల్లులు సృష్టించడంతో పాటు 6 డొల్ల కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీ ధర్మసాస్త కన్​స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్​స్ట్రక్షన్స్, రాగిణి ఇన్​ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్​స్ట్రక్షన్స్ అనే 6 డొల్ల కంపెనీలు నామ నాగేశ్వరరావు, నామ సీతయ్య ఆధీనంలోనే ఉన్నాయని ఈడీ పేర్కొంది. గత జులైలో హైదరాబాద్, పశ్చిమ బంగా, విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రూ.73 కోట్ల 74 లక్షల విలువైన 105 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో రూ.67 కోట్ల 8 లక్షల విలువైన 28 భూములు, భవనాలతో పాటు మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ గ్రానైట్స్​లో నామ నాగేశ్వరరావుకు చెందిన రూ.13 కోట్ల 57 లక్షల విలవైన షేర్లను కూడా జప్తు చేసింది. అలాగే అక్టోబర్​లో నామ నాగేశ్వరరావుకు చెందిన జూబ్లీహిల్స్​లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం, నివాసాన్ని కూడా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 3, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.