ETV Bharat / state

యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్​ను రూపొందించిన హైదరాబాదీ

author img

By

Published : Dec 24, 2020, 12:35 PM IST

Updated : Dec 24, 2020, 1:30 PM IST

ఇంటి నుంచి కాలు బయటపెట్టిన వెంటనే దుమ్ము, ధూళి స్వాగతం పలుకుతుంటాయి. శరీరానికి, చర్మానికి తీవ్రమైన హాని కలిగిస్తుంటాయి. పెరిగిన కాలుష్యం కారణంగా అధిక వేడి, అతినీల లోహిత కిరణాల నుంచి ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు కరోనా లాంటి వైరస్‌ల ముప్పు నానాటికీ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఓ యువతి తనకెదురైన అనుభవంతో.. ధూళి కణాలను జల్లెడ పట్టే వస్త్రాన్ని తయారు చేసింది. వైద్య శాస్త్రాన్ని సవాలు చేస్తున్న వైరస్‌లపై తన వినూత్న ఆవిష్కరణతో యుద్ధం చేస్తోంది..హైదరాబాద్ యువతి దీప్తి నత్తల.

యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్​ను రూపొందించిన హైదరాబాదీ
యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్​ను రూపొందించిన హైదరాబాదీ

యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్​ను రూపొందించిన హైదరాబాదీ

వ్యాధి నిరోధక శక్తి మనుషులకే కాదు.. ధరించే వస్త్రాలకూ ఎంతో అవసరం అంటోంది.. హైదరాబాద్‌కు చెందిన యువ వ్యాపారవేత్త.. దీప్తి నత్తల. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దీప్తి.. అడుగడుగునా ఎదురైన ఆటంకాలు అధిగమించింది. వైరస్‌ల్ని పసిగట్టి.. వ్యాధుల పనిపట్టే యాంటీ వైరల్ వస్త్రం తయారు చేసి.. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యకు తనవంతు పరిష్కారం చూపింది దీప్తి.

దీప్తి ప్రస్థానం

2007లో ఐఐటీ మద్రాస్ నుంచి నానో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీప్తి.. బెంగళూరు, ముంబయితో పాటు దుబాయ్, అమెరికాల్లోనూ ఉద్యోగం చేసింది. 2019లో భారత్‌కు తిరిగొచ్చిన సమయంలో స్థానిక వాతావరణానికి ఇబ్బంది పడింది. బయటకు వెళ్తే తలనొప్పి, చర్మ సమస్యలు వచ్చేవి. ఎండ తట్టుకోలేకపోయేది. సన్ స్క్రీన్ లోషన్, దుపట్టాలు వాడినా అనారోగ్య సమస్యలు తప్పలేదు. అప్పుడే మహిళలు వాడే దుపట్టాలు, చేతి రుమాలు ఎంత వరకు సురక్షితమో తెలుసుకోడానికి నేషనల్ ల్యాబోరేటరికి నమూనాలు పంపించింది. కాలుష్యం, అతినీల లోహిత కిరణాల నుంచి 10%మాత్రమే రక్షణ కల్పిస్తాయని తెలుసుకుని.. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకుంది.

మొదట యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్

ముందుగా దీప్తి.. అతినీల లోహిత కిరణాలు, ధూళి కణాల వల్ల వచ్చే సమస్యలపై దృష్టి పెట్టింది. వాటి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు, వచ్చే వ్యాధుల గురించి పరిశోధన చేసింది. అప్పుడే వైరస్, బ్యాక్టీరియాల్ని అడ్డుకునే వస్త్రం తయారు చేయాలనే ఆలోచ వచ్చింది. స్నేహితుల సహకారంతో కోయంబత్తూర్‌లోని అన్నా విశ్వవిద్యాలయం పరిశోధకుల్ని కలిసింది. బయోడీగ్రేడబుల్ ఫ్యాబ్రిక్ తయారీపై విస్తృత అధ్యయనం చేసింది. 8 నెలల కృషి తర్వాత యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్ తయారు చేసింది.. దీప్తి.

ఎలాంటి దుస్తులైనా కుట్టించుకోవచ్చు

దీప్తి తన ఫ్యాబ్రిక్.. మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉండగానే కరోనా వ్యాప్తి మొదలైంది. లాక్‌డౌన్ సమయంలో మరింత అధ్యయనం చేసి.. కరోనా సహా అన్నిరకాల సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించేలా దానిని తీర్చిదిద్దింది. సాధారణ కాటన్ వస్త్రం తీసుకొని అందులోకి బ్యాక్టీరియా, వైరస్‌లు చంపే నానో మాలిక్యూల్స్‌ చొప్పించింది. సూక్ష్మజీవులు, యూవీ కిరణాలు, బ్యాక్టీరియాలను చంపే ఒక బాడీగార్డ్‌ను రక్షణగా అతికించి.. ఈ నయా ఫ్యాబ్రిక్‌ను మలిచింది దీప్తి. ఈ వస్త్రంతో ఎలాంటి దుస్తులైనా కుట్టించు కోవచ్చు. వాటిని ధరించినప్పుడు వస్త్రంలోని నానో మాలిక్యూల్స్... వైరస్​లు, ఇతర వ్యాధి కారకాలను అడ్డుకుంటాయి.

ఈ వస్త్రాన్ని ఉతికినా.. అందులో ఉన్న నానో మాలిక్యూల్‌కు ఎలాంటి నష్టం కలగదు. 14 వారాల్లోనే అది మట్టిలో పూర్తిగా కలిసిపోతుంది. పర్యావరణానికి ముప్పు ఉండదు. దీప్తి తయారు చేసిన ఈ రకమైన వస్త్రాన్ని అన్ని రకాల ప్రయోగశాలల నుంచి అనుమతితోపాటు అధికారిక సంస్థల నుంచి ఆమోదం లభించింది.

మార్కెట్​ ప్రవేశం

2019 మార్చి నాటికే యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్ సిద్ధం చేసిన దీప్తి.. కరోనా సమయంలో తన ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎల్బీనగర్‌లోని తన నివాసంలోని ఓ గదిలో హెకాల్ పేరుతో అంకురసంస్థను ప్రారంభించింది. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. యాంటీ వైరల్ మాస్క్, యాంటీ వైరల్ చేతిరుమాలు, బెడ్ షీట్స్, హెడ్ కవర్ బ్యాండ్, పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్, పోలీసు దుస్తులు, కర్టెన్లు, సీటు కవర్లు, ఇలా అన్ని అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకునేలా హెకాల్ యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్ ను తీర్చిదిద్దింది.

మహిళా టైలర్లకు శిక్షణ

లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన మహిళా టైలర్లకు శిక్షణ ఇచ్చి ఇంటి నుంచే ఉపాధి పొందే మార్గం చూపించింది.. దీప్తి. హైదరాబాద్, ముంబయి, రాజమహేంద్రవరంలోని సుమారు 150 మంది మహిళలు.. హెకాల్​తో కలిసి పనిచేస్తూ.. ఆదాయం పొందుతున్నారు. నిప్ట్ విద్యార్థులు సైతం హెకాల్‌లో భాగస్వాములవుతూ యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్‌ను మరింత శక్తిమంతంగా తయారు చేస్తున్నారు.

వైరస్‌లను తట్టుకునే వస్త్రాలు తయారు చేస్తూ.. వ్యాపారవేత్తగా రాణిస్తున్న దీప్తి.. తన సంపాదనలో కొంతభాగం నిరుపేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇలాంటి మరెన్నో సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో పరిశోధనలు చేస్తోంది.

ఇదీ చూడండి: మనసులు గెలిచిన ప్రేమ.. మరణం ముందు ఓడింది.!

Last Updated : Dec 24, 2020, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.