వేసవి సెలవులైనా.. పండుగ పర్వదినాలైనా.. ఇంట్లో శుభకార్యమైనా.. వేడుక ఏదైనా భగవంతుని దర్శనం చేసుకోవాలని అనిపిస్తే వెంటనే బయలుదేరేది తిరుపతికే అనే మాట చాలామంది నోట వెంట వింటూ ఉంటాం. నిత్యం జనసంద్రంగా ఉండే తిరుమల గిరులు... భక్తి పారవశ్యంతో అలలాడే ఆలయ ప్రాంగణాలు... కిక్కిరిసిపోయి ఉండే క్యూలైన్లు... భక్తులను అనుగ్రహించే స్వామి దర్శనం నిలిచిపోతుందని ఎప్పుడైనా అనుకున్నామా... అలాంటి విపత్కర కష్టాన్నే తెచ్చిపెట్టింది మహమ్మారి కరోనా.
తల్లికి బిడ్డను దూరం చేసినట్టు... భక్తులకు భగవంతుని దర్శనాన్ని నిలిచిపోయేలా చేసింది. కరోనా వ్యాప్తితో తిరుమల ఆలయం మూసివేశారు. వేసవిలో కళకళలాడే తిరుమల భక్తులు లేక వెలవెలబోతోంది. గుండెల్లో దేవున్ని నయనాలతో చూడలేని పరిస్థితిలో మనసున కమ్ముకున్న బాధను అక్షరాలుగా లిఖించి... సంగీతంతో సానపట్టి... గాత్రంతో జీవం పోసి... భగవంతునికి విన్నవించుకున్నారు. శ్రీహరీ ఏమిదీ... కరుణ లేనిదా... ఆవిధి అంటూ సాగే ఆ పాటలోని అంతరార్థం... గాత్రంలోని ఆత్రం మనసుతో అర్థం చేసుకున్న వారికి కళ్ల వెంట నీళ్లు రాక మానవు.
ఇవీ చూడండి: సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్'