ETV Bharat / state

రేపు ఏపీ బడ్జెట్​.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు

author img

By

Published : May 19, 2021, 6:26 AM IST

2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​లో పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు చేయనుంది ఏపీ సర్కారు. ఈ మేరకు ప్రతిపాదనలను స్వీకరించింది. వీరి సంక్షేమం కోసం కేటాయించే నిధులను ప్రత్యేకంగా ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. ఆర్థికమంత్రి గురవారం నాడు శాసనసభకు బడ్జెట్​ను సమర్పించనున్నారు.

ap budget news
ap news

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి పిల్లల కోసం కేటాయింపులను ప్రత్యేకంగా ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. ఈ మేరకు గతంలోనే నిర్ణయం తీసుకుని అన్ని శాఖల నుంచి ఇదే తరహాలో ప్రతిపాదనలను స్వీకరించింది. 18 ఏళ్లలోపు పిల్లలపై వివిధ పథకాల ద్వారా రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో విడిగా లెక్కలు కట్టి తాజా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నివేదించనుంది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం 2021-22 బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనున్నారు. కొవిడ్​ కారణంగా ఇప్పటికే 3 నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్సు రూపంలో ఆమోదించారు. దీనికి సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మొత్తం 12 నెలలకు బడ్జెట్‌ ప్రతిపాదిస్తూ 9 నెలల కాలానికి ఆమోదం తీసుకుంటారు.

మహిళల పథకాలకు కేటాయింపులు విడిగా..మహిళలు, బాలికల సంక్షేమ పథకాలు.. వాటి కేటాయింపులను కూడా బడ్జెట్‌లో విడిగా క్రోడీకరించనున్నారు. వారి పురోగతికి దోహదపడుతున్న పథకాలను ప్రస్తావించనున్నారు. ఇదే సమయంలో ప్రణాళికేతర వ్యయం, కార్యాలయాల నిర్వహణ, వాహనాల ఖర్చులు తదితరాలపై కోత పడనుంది.

వీటికి సంబంధించి 2020-21 బడ్జెట్‌లో దాదాపు అన్నింటిలోనూ 20శాతం వరకు కోత పెట్టారు. కార్యాలయాల అద్దె చెల్లింపులు భారమయ్యాయి. కొత్తగా వాహనాలు కొనొద్దని నిర్దేశించారు. కన్సల్టెంట్లు, పొరుగుసేవల సిబ్బంది నియామకంపై కట్టడి విధించారు. తాజా బడ్జెట్‌లో వీటన్నింటిపైనా ప్రభావం పడుతుంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.