ETV Bharat / state

కత్తులు దూస్తున్న కోళ్లు.. జోరుగా సంక్రాంతి పందాలు షురూ!

author img

By

Published : Jan 10, 2023, 11:48 AM IST

కోడి పందేెలు
కోడి పందేెలు

Sankranthi cock fighting: కొత్త ఏడాది ఆరంభం నుంచే ఏపీలోని పలు జిల్లాలో కోడిపందేల హడావుడి మొదలైంది. పందెంరాయుళ్లు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా ఆదివారం బాపట్ల సమీపంలోని అడవులదీవిలో జోరుగా కోడిపందేలు నిర్వహించారు.

Sankranthi cock fighting: కొత్త ఏడాది ఆరంభం నుంచే ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేల హడావుడి మొదలైంది. సంక్రాంతి నేపథ్యంలో తీర ప్రాంతంలో భారీగా బరుల ఏర్పాటుకు కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికార పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడి అభయం తీసుకుంటున్నారు. మంచి ఆదాయ మార్గం కావడంతో బరుల నిర్వహణకు గతంలో కంటే ఈ ఏడాది నాయకుల్లో పోటీ పెరిగింది. బరికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పేందుకు సైతం నిర్వాహకులు వెనకాడటంలేదు.

రెపల్లే, వేమూరు నియోజకవర్గాల్లో గతేడాది పెనుమూడి, నిజాంపట్నం, పల్లెకూనలో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సంవత్సరం బరుల ఏర్పాటు కోసం అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు పోటీపడుతున్నారు. ప్రాంతాల వారీగా ఈనెల 10 నుంచి 12 వరకు, 13 నుంచి 16 వరకు వరుసగా పందేలు నిర్వహించి సొమ్ము చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు.

పండగ సమయంలో రూ.కోట్లలో నగదు చేతులు మారనుంది. బరి ఏర్పాటుకు ప్రజాపతినిధుల అండదండలుంటే పోలీసులు ఆ వైపు రారన్న ధీమాలో నిర్వాహకులు ఉన్నారు. ఎంచక్కా పందేలు, పేకాట, గుండాట తదితర జూద క్రీడలు నిర్వహించుకోవచ్చన్న భావనలో ఉన్నారు. పందెంరాయుళ్లకు విందు భోజనాలు, మద్యం సరఫరా చేసి ఆకట్టుకోవాలని చూస్తున్నారు. పందేలు నిర్వహిస్తాం రమ్మంటూ హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడలోని ప్రముఖ వ్యాపారులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు.

అప్పుడే మొదలెట్టేశారు: నూతన సంవత్సరం ప్రారంభం రోజే చుండూరు మండలం వేటపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలం స్టూవర్టుపురం, నిజాంపట్నం కొత్తపాలెం, నగరం మండలం ఈదుపల్లిలో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. తాజాగా అడవులదీవిలో భారీగా పందేలు వేశారు. కోళ్లు కత్తులు దూశాయి. ఏకంగా బరి ఏర్పాటు చేసి కోళ్ల పందేలు వేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించి పందేలు నిర్వహిస్తున్నామని ఎవరూ భయపడవద్దంటూ పందెంరాయుళ్లకు వైకాపా నేతలు భరోసా ఇచ్చారు.

మూడు నుంచి నాలుగు గంటలకు పైగా బహిరంగంగా పందేలు వేశారు. సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో పందేలు జోరందుకున్నాయి. పందెం కోళ్లకు డిమాండ్‌ పెరిగింది. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోను కోళ్ల పందేలు గుట్టుచప్పుడు కాకుండా వేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలతో అడపాదడపా అక్కడక్కడ దాడులు చేసి చిన్నపందేలు వేసిన వారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. రేపల్లె మండలం బేతపూడి, పేటేరు, మైనేనివారిపాలెం, మోళ్లగుంట శివారుల్లో చిన్నపాటి జాగా కనిపిస్తే చాలు పందేలు వేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు వెళ్లేప్పటికి గుట్టు చప్పుడు కాకుండా జారుకుంటున్నారు. చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల్లో కొందరు నేతలు జూద శిబిరాలు జోరుగా నిర్వహిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. కోడి పందేలు, జూదంలో పెద్ద ఎత్తున నగదు పోగొట్టుకుని పలువురు అప్పుల పాలవుతున్నారు. ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయికి ప్రత్యేక పోలీసు బృందాలను పంపించి దాడులు చేయించి నిర్వాహకులపై కేసులు నమోదు చేసి పట్టుకుంటేనే పందేలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.