ETV Bharat / state

saddula bathukamma: రాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా సద్దుల బతుకమ్మ సంబురాలు

author img

By

Published : Oct 14, 2021, 5:24 AM IST

Updated : Oct 14, 2021, 6:42 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు(saddula bathukamma 2021) అంబరాన్నంటాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రహదారులన్ని కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో వీధులన్ని మారుమోగాయి.

saddula bathukamma
saddula bathukamma

రాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా సద్దుల బతుకమ్మ సంబురాలు

రంగురంగు పూలతో బతుకమ్మలు.... ఆడపడుచుల ఆటపాటలు.... బాణాసంచా వెలుగులు.... సంప్రదాయ నృత్యాలతో పట్టణాలు, గ్రామాలు హోరెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చిన ఆడపడుచులు... ఆటలాడుతూ సందడిగా గడిపారు.

ప్రపంచం మొత్తానికి తెలిసేలా నిర్వహిస్తాం

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించగా... సద్దుల బతుకమ్మ సందర్భంగా ఐటీ ఉద్యోగులు ఆడిపాడారు. అంబర్‌పేట మున్సిపల్‌ మైదానంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. పండుగ సంబురాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కరోనా తగ్గితే కేంద్ర ప్రభుత్వం తరఫు దిల్లీలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ పండుగను ప్రపంచం మొత్తం తెలిసేలా జరుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో మహిళలు ప్రకృతిపండుగను ఘనంగా జరుపుకున్నారు. గుడిమల్కాపూర్ జామ్‌సింగ్ ఆలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో దాండియా ఉత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది. చిన్నాపెద్దా అంతా కలిసి నృత్యాలతో అలరించారు.

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వీధివీధినా వైభవంగా..

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో.... సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు ఆడిపాడారు. సిద్దిపేటలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు...కోమటి చెరువులో అక్వా స్ర్కీన్ మ్యూజికల్ ఫౌంటేయిన్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చెరువుగట్టున సద్దుల బతుకమ్మ సందడిగా సాగింది. సుమారు 30 వేల మంది ప్రజలు చెరువు కట్ట వద్ద బతుకమ్మలు పెట్టి ఆడిపాడారు.

కరీంనగర్​లో కోలహలంగా..

కరీంనగర్ జిల్లా మానకొండూరులో మహిళలంతా ఒక్కచోటుకు చేరి పూల పండుగ ఆడుతూ ఆహ్లాదంగా గడిపారు. ఆడపడుచుల బతుకమ్మ ఆటలతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కోలాహలంగా మారింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ కాలు కదిపారు. మహబూబ్‌నగర్‌లోని మినీ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఆడపడుచుల ఆటలు, కళాకారుల డప్పు చప్పుళ్లతో ప్రాంగణం సందడిగా మారింది.

యాదాద్రిలో సందడిగా..

విద్యుత్​ వెలుగుల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
విద్యుత్​ వెలుగుల్లో బతుకమ్మలు

యాదాద్రి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు సందడిగా జరిగాయి. హౌసింగ్‌బోర్డ్‌ కాలనీ, భువనగిరి పెద్ద చెరువు వద్దకు మహిళలు భారీ సంఖ్యలో వచ్చి ఆడిపాడారు. ఖమ్మంలో వెన్నముద్దల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. పోలీసుల పరేడ్‌ మైదానంలో అధికారుల కుటుంబసభ్యులు, మహిళా ఉద్యోగులు ఆడిపాడారు. హనుమకొండలో సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరపాలనే అయోమాయం నెలకొనడంతో... పద్మాక్షి గుండం వద్దకు అతి కొద్దిమంది మహిళలు వచ్చి ఆడిపాడారు. కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పోచారంలో చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సరదాగా గడిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ కవిత కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు బతుకమ్మ ఆడారు.

కుటుంబ సభ్యులతో  ఎంపీ కవిత
కుటుంబ సభ్యులతో ఎంపీ కవిత

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

బతుకమ్మ వేడుకలతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్​, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి...వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. గద్వాల జిల్లా జోగులాంబ ఆలయంలో ఆరో రోజు అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. మహబూబాబాద్‌లో మార్వాడీలు ప్రతిష్టించిన దుర్గామాత వద్ద ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. సిరిసిల్ల శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు పెదశేష వాహనంపై ఊరేగారు. శ్రీవెంటరమణుడికి పురవీధుల్లోని భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: Saddula Bathukamma: అంబరాన్నంటిన సద్దుల సంబురాలు.. ఉయ్యాల పాటలతో మారుమోగిన ఊళ్లు

Last Updated : Oct 14, 2021, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.