ETV Bharat / state

బడ్జెట్​లో విద్యారంగానికి రూ.19,093కోట్లు కేటాయింపు

author img

By

Published : Feb 6, 2023, 1:08 PM IST

telangana budget
బడ్జెట్​లో విద్యారంగం

Telangana Budget 2023: రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోంది. ‘మన ఊరు మన బడి’ ద్వారా పాఠశాలల అభివృద్ధి, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోంది. విద్యాశాఖ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో రూ.19,093కోట్లు ప్రతిపాదించారు.

RS.19093 Crores For Education In Telangana Budget: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అందులో విద్యారంగానికి కూడా ఈ బడ్జెట్​లో పెద్దపీట వేశారు. మొత్తం రూ.19093 కోట్లును కేటాయించారు.

మన ఊరు మన బడి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరిచేందుకు మన ఊరు మన బడి అనే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి.. 26065 పాఠశాల్లో మూడు దశల్లో అమలు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. ఇందుకు రూ.7289 కోట్లు కేటాయించిందని.. మొదటి దశలో భాగంగా 9123 పాఠశాల్లో రూ.3497 కోట్లతో పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం కింద డిజిటల్ విద్యతో పాటు, తాగునీటి వసతి, సరిపడినంత ఫర్నిచర్​, ప్రహరీలు, కిచెన్ షెడ్​లు, మరుగుదొడ్లు నిర్మాణం వంటి పన్నెండు రకాలు అంశాల్లో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ఊరూరా ఉత్సవంలా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారని అన్నారు.

యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.500 కోట్లు ఈ వార్షిక బడ్జెట్​లో ప్రభుత్వం ప్రతిపాదించింది. యూనివర్సిటీల్లో మౌలిక వసతులకు ఇంతపెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

ఆంగ్ల మాధ్యమం: ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈ పాఠ్య పుస్తకాలను పరిశీలించి అభినందించింది.

ఇంటర్మీడియట్​ విద్యార్థులకు శిక్షణ: రాష్ట్రంలో 2962 ఇంటర్మీడియట్ కళాశాలల్లో 948321 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్​ పూర్తి చేసిన విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావడానికి కావాల్సిన శిక్షణను ప్రభుత్వం అందిస్తున్నది.

సాంకేతి విద్య: రాష్ట్రంలో సాంకేతిక విద్యకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గత ఎనిమిదిన్నరేళ్లలో కొత్తగా 14 పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసింది. 2023-24 విద్యాసంవత్సం నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించబోతున్నది. రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలో 4 కొత్త ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వీటిలో సిరిసిల్ల, వనపర్తి కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ప్రారంభించబోతున్నది. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ఫార్మారంగాన్ని దృష్టిలో ఉంచుకొని సుల్తాన్​ పూర్​లో జేఎన్​టీయూకు అనుబంధంగా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాసుటికల్ సైన్సెస్​ను ఏర్పాటు చేసింది.

విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,606 పాఠశాలల్లో చదువుతున్న 25.26 లక్షల మంది విద్యార్థులకు, 4,237 హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లోని 9.77 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇందుకోసం ప్రతి నెలా 21,868 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్, సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నది. భావి పౌరులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే ఆశయంతో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో సన్నబియ్యంతో విద్యార్థులకు అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

మధ్యాహ్న భోజనం వంటపని చేసేవారికి పారితోషకం పెంపు: మధ్యాహ్న భోజనం పథకంలో వంటపని చేసే 54,201 మందికి ఇప్పటివరకు నెలకు రూ.1000 పారితోషికం అందుతున్నది. గతంలో సీఎం కేసీఆర్ ఇదే సభలో ప్రకటించిన విధంగా వారికిచ్చే పారితోషకాన్ని నెలకు రూ.3000 పెంచారు. వీటి అన్నింటిని దృష్టిలో ఉంచుకొని విద్యారంగానికి రూ.19093 కోట్లు ప్రతిపాదించారు.

గురుకులాలకు పెద్దపీట: రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో 293 గురుకులాలు అరకొర వసతులతో ఉండేవి.. వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య లక్షా 31వేలుగా ఉండేవారు. తెలంగాణ ఏర్పడగానే నూతన గురుకుల విద్యాలయాల స్థాపనకు పూనుకుని నేడు గురుకులాల సంఖ్య 1002వరకు పెరిగితే.. విద్యార్థుల సంఖ్య కూడా 5లక్షల 59వేలుగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో గురుకులాల మీద బడ్జెట్ రూ.784కోట్లు ఉంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3400కోట్లకు కేటాయింపులు పెంచింది.

"రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్ఠమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. సమాజంలో వికాసం సాధించాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని భావించి.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్​లో రూ.19093 కోట్లను కేటాయించింది." - హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.