ETV Bharat / state

KCR మోడల్ దేశానికి.. రాష్ట్రానికి అత్యంత ప్రమాదం: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Apr 10, 2023, 8:42 PM IST

Revanth Reddy Fires on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. భూమాఫియా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ రాజకీయాలను సీఎం శాసించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ భూ దోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Revanth Reddy
Revanth Reddy

KCR మోడల్ దేశానికి.. రాష్ట్రానికి అత్యంత ప్రమాదం: రేవంత్‌రెడ్డి

Revanth Reddy Fires on KCR: కేసీఆర్ మోడల్ దేశానికి, రాష్ట్రానికి అత్యంత ప్రమాదమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీది కార్పొరేటర్ మోడల్ అయితే.. బీఆర్‌ఎస్‌ది మాఫియా మోడల్‌ అని విమర్శించారు. దేశంలోని పార్టీలకు వేల కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి బేరసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో జేడీయూకు వందల కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూ మాఫియా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ రాజకీయాలను ముఖ్యమంత్రి శాసించాలని చూస్తున్నారని విమర్శించారు. హెటిరో పార్థసారథి రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. ఆయన ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాంటి పార్థసారథి రెడ్డి క్యాన్సర్ ఆసుపత్రికి భూములు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సాయి సింధు సంస్థకు హైటెక్ సిటీ దగ్గరలో 15 ఎకరాలు కేటాయించారని వెల్లడించారు.

ఇంతకంటే దోపీడీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?: అందుకు ఎకరానికి రూ. 33.70 కోట్లని రంగారెడ్డి కలెక్టర్ విలువ కట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎస్ ఆసుపత్రికి 15 ఎకరాలు అక్కర్లేదని 10 ఎకరాలు చాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. కానీ కొత్త జీవో ప్రకారం భూములు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. వాస్తవానికి 15 ఎకరాలకు రూ. 1500 కోట్లు ఉంటే.. రూ. 505 కోట్లకు మాత్రమే ధర నిర్ణయించారని పేర్కొన్నారు. ఇంతకంటే దోపీడీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి భూ దోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తాం: ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలు కాదని కేసీఆర్.. పార్థసారథి రెడ్డికి చౌకగా భూములు కట్టబెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి భూ దోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తామని అన్నారు. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో దరిదాపుల్లోకి రాకుండా చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు ఆయనను వదిలించుకోవాలని లేఖ రాస్తామని చెప్పారు.

రూ.2లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేశారని.. రూ. 47లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న దేశ రాజకీయాల్లోకి ఆయన వస్తే అత్యంత ప్రమాదకరమని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు దోపిడీకి సహకరించిన అధికారులు జైలుకెళ్లక తప్పదని అన్నారు. ఈ క్రమంలోనే సోమేశ్ కుమార్‌, అర్వింద్‌కుమార్, జయేష్‌రంజన్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఖానామెట్ భూములపై ధారవాహికగా వివరాలు: ఖానామెట్‌లో 41 సర్వే నెంబర్‌లో 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ఆ భూముల్లో కేసీఆర్ 60 ఎకరాలు మాఫియాకు కట్టబెట్టారని చెప్పారు. రేపు యశోద ఆస్పత్రి కొల్లగొట్టిన భూములపై వివరాలు వెల్లడిస్తామని వివరించారు. ఖానామెట్ భూములపై ధారవాహికగా వివరాలు విడుదల చేస్తామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

"భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకున్నారు. హెటిరో పార్థసారథి రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. పార్థసారథి రెడ్డి క్యాన్సర్ ఆస్పత్రికి భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. సాయిసింధు సంస్థకు హైటెక్ సిటీ దగ్గరలో 15 ఎకరాలు కేటాయించారు. కేసీఆర్ భూ దోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తాం. కేసీఆర్‌కు దోపిడీకి సహకరించిన అధికారులు జైలుకెళ్లక తప్పదు." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి: పెండింగ్​ బిల్లులు... గవర్నర్‌పై ప్రభుత్వం వేసిన పిటిషన్​పై విచారణ వాయిదా

'కేసులుంటే ఎన్నికల్లో పోటీకి నో​'.. కేంద్రానికి 4 వారాల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.