ETV Bharat / state

Projects In Telangana: తేలిపోతున్న పనులు.. పునరుద్ధరణపై పర్యవేక్షణ కరవు

author img

By

Published : Sep 29, 2021, 10:20 AM IST

Projects In Telangana
Projects In Telangana

నిర్మాణంలో నాణ్యత లోపాలు సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆయకట్టు తడవకముందే గేట్లు కొట్టుకుపోవడం, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోతున్న పరిస్థితులు పలు ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నాయి. గుత్తేదారులు, రాజకీయ నాయకులు, ఇంజినీర్ల కుమ్మక్కు దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి సుదూర ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరందించేందుకు పటిష్ఠంగా నిర్మించాల్సిన కాల్వలు కుంగిపోతున్నాయి. పిల్ల కాల్వలు మూసుకుపోయి నీరంతా వృథాగా పోతోంది. ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలను ఉమ్మడి వరంగల్‌ మీదుగా ఖమ్మం జిల్లా తీర్థాల వరకు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ మెయిన్‌(డీబీఎం) 48, 38ల పరిధిలో పనులు, వాటి కింద నిర్మిస్తున్న పర్వతగిరి పెద్ద చెరువు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పిల్ల కాల్వల పునరుద్ధరణ నిబంధనల మేరకు సాగడం లేదు. పర్యవేక్షణ కొరవడటంతో కొందరు గుత్తేదారులు ‘మమ’ అనిపించేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పనులు తేలిపోతూ..

కాకతీయ ప్రధాన కాల్వ నుంచి సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద డీబీఎం 48 కాల్వకు ఎస్సారెస్పీ నీళ్లు మళ్లుతాయి. ఇది 83 కిలోమీటర్లు పొడవు ఉండగా 1.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనేక పిల్ల కాల్వలు ఉన్నాయి. మరమ్మతులకు రూ.125 కోట్లు కేటాయించారు. గీసుగొండ మండలం నుంచి డీబీఎం 38కు నీళ్లు మళ్లుతాయి. ఈ కాల్వ పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఇటీవల ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలో లైనింగ్‌ ధ్వంసమైంది. పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. డీబీఎం 48 ఉప కాల్వల పనుల్లోనూ అనేక లోపాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల లైనింగ్‌ దెబ్బతిన్నది. మరమ్మతులు, పూడికతీత ప్రక్రియలు సక్రమంగా చేపట్టడం లేదని రైతులు చెబుతున్నారు.

ఇంజినీర్లపై ఒత్తిళ్ల ప్రభావం

ఈ పనుల్లో చాలా చోట్ల ఇంజినీర్లు, కింది స్థాయి సిబ్బందిపై పలువురు ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత, పర్యవేక్షణకు సంబంధించి కొందరు గుత్తేదారులు ఒత్తిడి తేవడంతోనే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధిలోని నిర్మాణాలకు బాధ్యత వహిస్తున్న పలువురు ఇంజినీర్లపై బదిలీవేటు కూడా పడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలంలో ఈఈ నుంచి దిగువ స్థాయి వరకు పలువురిని కావాలనే బదిలీ చేయించారన్న చర్చ నీటిపారుదల శాఖ వర్గాల్లో జరుగుతోంది.

నాణ్యతపై పరిశీలన చేపడతాం

డీబీఎం 48లో నాణ్యత లేమిపై ఫిర్యాదులు అందలేదు. కొద్దికాలం నుంచే ఆ సర్కిల్‌కు ఇన్‌ఛార్జిగా ఉన్నాను. ఆయా పనులపై పరిశీలన చేపడతాం. డీబీఎం 38కి సంబంధించి మల్లంపల్లి సమీపంలో వదులు మట్టితో కాల్వ కుంగి లైనింగ్‌ పోయింది. దాన్ని మరమ్మతు చేయిస్తున్నాం. ఇతరత్రా లోపాలు ఏమైనా ఉంటే గుర్తించాలని ఇంజినీర్లను ఆదేశించాం.

- విజయ్‌భాస్కర్‌, ముఖ్య ఇంజినీర్‌, ములుగు (వరంగల్‌ ఇన్‌ఛార్జి)

జలాశయం పనుల్లో రాజీ

కోతలు

డీబీఎం 48 ప్యాకేజీలో భాగంగా రూ.26 కోట్ల ప్రతిపాదిత అంచనాతో చేపట్టిన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం పెద్దచెరువు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనుల్లో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇవి సాగుతున్నా.. కట్ట పునరుద్ధరణ, రివిట్‌మెంట్‌ తదితర పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీకే గడువు ముగియగా.. వచ్చే సంవత్సరం వరకు పొడిగించారు. దీని కింద 2,148 ఎకరాల ఆయకట్టు ఉంది. కట్ట ఎత్తు పెంపు, వెడల్పు చేసే పనులు పూర్తికాగా నిర్మాణంలో వినియోగించిన మెటల్‌ నాణ్యత లోపించినట్లు తెలుస్తోంది. పెద్దపెద్ద రాళ్లతో కలగలిపి ఉన్న మట్టితో నిర్మించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కట్టకు బలాన్ని ఇచ్చేందుకు నిర్మిస్తున్న రివిట్‌మెంట్‌లో వినియోగిస్తున్న రాళ్ల పరిమాణం సరిగా లేదు. దిగువన 300 ఎం.ఎం, పైకి వచ్చే కొద్దీ 450 ఎం.ఎం. పరిమాణం ఉన్న రాళ్లకు బదులు చిన్నచిన్నవాటితో పనికానిచ్చేస్తున్నారు. ఈ జలాశయం నీటితోనే కల్లెడ, దౌలత్‌నగర్‌, బూర్గుమళ్ల, సోమారం ఇతర గ్రామాల చెరువులను నింపాల్సి ఉంటుంది. పనులు నాణ్యతగా లేకపోవడంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఇదీ చూడండి: ఒక్కో ప్రాజెక్టుదీ ఒక్కో కథ.. ప్రశ్నార్థకంగా జలాశయాల భవిష్యత్తు

SRSP: మరమ్మతులు చేయించినా ఫలితం లేకపోయిందే..!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.