SRSP: మరమ్మతులు చేయించినా ఫలితం లేకపోయిందే..!!

author img

By

Published : Aug 21, 2021, 7:25 AM IST

sri-ram-sagar-project

ఏదైనా నిర్మాణం పాడైపోతేనో... బీటలు వారితేనో వాటిని మరమ్మత్తులు చేస్తాం. కానీ మరమ్మత్తుల్లోనూ కూడా నాణ్యత లోపిస్తే... రూ.100 కోట్ల వరకు కేటాయించి ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవనం పథకం కింద మరమ్మత్తులు ప్రారంభిస్తే... ఒక్క పంటకు నీరు చేరకుండానే లైనింగ్ కొట్టుకుపోయింది. సరిగ్గా పంట కాలంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది.

శ్రీరామసాగర్‌ పునరుజ్జీవన పథకం కింద చేపట్టిన మరమ్మతుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి సమీపంలో డీబీఎం 38 కాల్వ లైనింగ్‌ దాదాపు యాభై మీటర్లకుపైగా కొట్టుకుపోయింది. సాగునీరు సక్రమంగా అందక ఇన్నాళ్లూ నిరాశతో ఉన్న రైతుల్లో సరిగ్గా పంట కాలంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన పెరిగింది. ధ్వంసమైన ప్రాంతంతోపాటు ఎగువన, దిగువన చాలా చోట్ల లైనింగ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కాల్వలో నీరు పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తోడుకావడంతో తీవ్రంగా దెబ్బతింది. మట్టి కుంగిపోయింది. కాల్వకు ఇరువైపులా పగుళ్లు ఏర్పడ్డాయి. సిమెంట్‌ లైనింగ్‌ పగిలిపోయి ప్రవాహంలో కొంత మేరకు కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల ఇరువైపులా పగుళ్లు తేలాయి. కాల్వ మధ్యభాగంలో బెడ్‌ కోతకు గురైంది. వాస్తవానికి నిర్మాణ సమయంలో మట్టి పటుత్వాన్ని పరీక్షించి లైనింగ్‌ వేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ధ్వంసమైన చోట మట్టి సులువుగా జారీ పోయే గుణం ఉండటంతో ఇలా జరిగి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

మూడేళ్ల నుంచి పనులు...

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని అందించడంలో భాగంగా కాల్వలు నిర్మించారు. వాటి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల జలాలను పూర్తిస్థాయిలో అందించేందుకు కాల్వల మరమ్మతులు, అసంపూర్తిగా ఉన్నచోట నిర్మాణాలు, పునరుద్ధరణ ప్రక్రియను చేపట్టింది. నాలుగేళ్ల క్రితం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం కింద డీబీఎం 38 పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.100 కోట్ల వరకు కేటాయించింది. మూడేళ్ల నుంచి గుత్తేదారు పనులు కొనసాగిస్తున్నారు. దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు నాలుగు నెలల క్రితమే పూర్తయ్యాయి. అయినా ఒక్క పంటకు కూడా నీరు చేరకుండానే లైనింగ్‌ కొట్టుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు లైనింగ్‌ మరమ్మతులు పూర్తి చేయడం సాధ్యం కాదు. ఒక వేళ ప్రవాహాన్ని వదిలితే కాల్వ దెబ్బతినొచ్చు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ములుగు ముఖ్య ఇంజినీరు విజయభాస్కర్‌ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాల్వ మట్టి వదులుగా మారి లైనింగ్‌ తొలగిపోయినట్లు గుర్తించామని తెలిపారు. గుత్తేదారుతో తిరిగి పనులు పూర్తి చేయిస్తామని, ఇతర ప్రాంతాల్లో కాల్వ దెబ్బతిన్న సమాచారమేదీ తమకు అందలేదన్నారు.

80 వేల ఎకరాల ఆయకట్టు

దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాల్వ ద్వారా వచ్చే నీటిని గీసుగొండ మండలంలో డిస్ట్రిబ్యూటరీ మెయిన్‌ (డీబీఎం) 38 కాల్వకు మళ్లిస్తారు. దీని ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ములుగు, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలతోపాటు నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లోనూ కొంత ఆయకట్టు ఉంది. తాజాగా లైనింగ్‌ దెబ్బతిన్న పరిస్థితులతో ఈ ఆయకట్టుకు నీరందడం కష్టమే.

ఇదీ చూడండి: CM KCR review: హుజూరాబాద్​లో ఏం జరుగుతోంది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.