ETV Bharat / state

సామాన్యులకు అందనంటున్న వంటనూనెలు

author img

By

Published : Nov 22, 2020, 9:08 AM IST

Updated : Nov 22, 2020, 11:44 AM IST

prices-rise-of-edible-oil-in-india
సామాన్యులకు అందనంటున్న వంటనూనెలు

కరోనా నేపథ్యంలో వంటనూనెలకు రెక్కలు వచ్చాయి. అందనంత ఎత్తులో ఎగురుతూ పేదలకు అందను అంటున్నాయి. చిల్లర మార్కెట్లలో సైతం వీటి ధర ఎక్కువగానే ఉండటంతో నూనెలు కొనేందుకు సామాన్యులు అల్లాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ధరలు పెంచడం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందని ఆయిల్‌ఫెడ్‌ జనరల్ తెలిపారు. ‌

వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. రికార్డు స్థాయిలో ప్రతీ వంటనూనె లీటరు రూ.100 దాటిపోయింది. గతంలో అన్ని నూనెల ధరలు రూ.100 దాటినా పేదలు ఎక్కువగా వాడే పామాయిల్‌ ధర తక్కువగానే ఉండేది. ఇప్పుడదీ అనూహ్యంగా పెరిగింది. లీటరు పామాయిల్‌ను రికార్డుస్థాయిలో రైతుబజార్లలోనే రూ.105కి అమ్ముతున్నట్లు ‘రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’(ఆయిల్‌ఫెడ్‌) తాజాగా ప్రకటించింది.

‘విజయ’ బ్రాండు పేరుతో ఈ సంస్థ వంటనూనెలను విక్రయిస్తోంది. బయటి చిల్లర మార్కెట్లలో రూ.110కి పైనే అమ్ముతున్నారు. గత 4 నెలల్లోనే అన్ని వంటనూనెల ధరలు లీటరుకు రూ.21 నుంచి 28 దాకా అదనంగా పెరగడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఇక మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కొనే పొద్దుతిరుగుడు సెప్టెంబరుతో పోలిస్తే గత నెలలో కొంత తగ్గినా మళ్లీ ఇప్పుడు రూ.128కి పెరిగింది. వేరుసెనగ నూనె రైతుబజార్లలోనే ఏకంగా రూ.139కి చేరింది. బయటి మార్కెట్లలో కొన్ని బ్రాండ్ల కంపెనీలు దీనిని రూ.150 దాకా అమ్ముతున్నాయి.

ఎందుకీ ధరల మంట..?

భారత్‌లో వాస్తవానికి కరోనా కారణంగా హోటళ్లు, వీధి తినుబండారాల దుకాణాలు, ఫంక్షన్లు వంటివి పెద్దగా లేనందున వంటనూనెల వాణిజ్య అమ్మకాలు తగ్గాయి. గత ఆరు నూనెల సంవత్సరాల్లో తొలిసారి 2019-20లో వంటనూనెల దిగుమతి 13 శాతం తగ్గింది. ఈ నెల ఒకటి నుంచే కొత్త ‘నూనెల ఏడాది’(2020-21) మొదలైంది. ఏటా నవంబరు నుంచి మరుసటి అక్టోబరు దాకా నూనెల ఏడాదిగా వ్యాపార వర్గాలు పరిగణిస్తాయి. 2019-20లో కోటీ 31లక్షల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు. నూనెల ఏడాది(2018-19)లో దిగుమతి అయిన కోటీ 49లక్షల టన్నులతో పోలిస్తే 18లక్షల టన్నులు తగ్గడం గత ఆరేళ్లలో కొత్త రికార్డు. కరోనాతో వంటనూనెలకు వాణిజ్య డిమాండు లేనందున దిగుమతులు తగ్గినట్లు భారత నూనెల మిల్లుల సమాఖ్య వెల్లడించింది. అయినా ధరలు పెరగడానికి చైనా కారణమని ఆయిల్‌ఫెడ్‌ వెల్లడించింది. ఇటీవల మనదేశం నుంచి 90వేల టన్నుల వేరుసెనగ నూనె దిగుమతికి చైనా వ్యాపారులు గుజరాత్‌ మిల్లులకు ఆర్డర్లు ఇచ్చారు. టన్ను వేరుసెనగ నూనెకు రూ.లక్షన్నరకు పైగా చెల్లించడానికి వారు ముందుకు రావడంతో ఇక్కడ చిల్లర మార్కెట్‌లో లీటరు రూ.140 దాటింది. పొద్దుతిరుగుడు, పామాయిల్‌ పరంగానూ చైనా, ఐరోపా దేశాలు దిగుమతులు పెంచుకోవడం వల్ల మనవద్ద కూడా వాటి ధరలు పెరిగాయని ఆయిల్‌ఫెడ్‌ వివరించింది.

అంతర్జాతీయ పరిణామాలతో..

మలేసియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్‌ను.. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి పొద్దుతిరుగుడు నూనెను మన ఆయిల్‌ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ధరలు పెంచడం వల్ల తరచూ ఇక్కడా పెంచాల్సి వస్తోందని ఆయిల్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ తిరుమలరెడ్డి వివరించారు. ఫలితంగా విజయతో పాటు ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల నూనెల అమ్మకాలు తగ్గాయని, తక్కువ ధరలకు విక్రయించే సాధారణ కంపెనీల ప్యాకెట్లు, విడిగా అమ్మే నూనెల అమ్మకాలు పెరిగినట్లు అధ్యయంలో గుర్తించామని తిరుమలరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

Last Updated :Nov 22, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.