Pv Sindhu: శంషాబాద్​ విమానాశ్రయంలో సింధుకు గ్రాండ్ వెల్​కం

author img

By

Published : Aug 4, 2021, 3:15 PM IST

Updated : Aug 4, 2021, 3:58 PM IST

Pv sindhu

ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన అనంతరం స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు హైదరాబాద్​కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది.

సింధుకు గ్రాండ్ వెల్​కం

అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని స్టార్ షట్లర్ పీవీ సింధు (Pv Sindhu) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు.. హైదరాబాద్ చేరుకుంది. దిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సింధుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, శాట్స్‌ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘన స్వాగతం పలికారు. అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని వెల్​కం చెప్పారు.

నన్ను విష్ చేయడానికి వచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్... ఇంకా ఇతర అధికారులకు, అభిమానులకు అందరికీ థాంక్స్. మీ సపోర్ట్ వల్ల సాధించగలిగాను. నేను ఎప్పుడు ఏం అడిగినా నాకు సపోర్ట్ చేశారు. ఒలింపిక్స్​కు వెళ్లే ముందు గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్​కు అనుమతి ఇచ్చినందుకు మినిస్టర్​కు థాంక్స్. రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. మున్ముందు కూడా మంచిగా ఆడి దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తా.

-- పీవీ సింధు, స్టార్ షట్లర్

మీ సపోర్ట్ వల్లే సాధించగలిగా...

దేశ ప్రజలందరూ పీవీ సింధు స్వర్ణం సాధించాలని కోరుకున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్... క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. తెలంగాణలో క్రీడా పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు సింధు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

దేశ ప్రజలకు గర్వించే రీతిలో పీవీ సింధు రెండు సార్లు మెడల్స్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఒలింపిక్స్​లో వంద శాతం స్వర్ణం సాధించాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. త్వరలోనే క్రీడాపాలసీని తీసుకురాబోతున్నాం. భవిష్యత్​లో తెలంగాణ క్రీడా హబ్​గా మారుతుంది. పీవీ సింధు మరిన్ని పతకాలు సాధించాలని కోరుతున్నా. ఆమెకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

-- శ్రీనివాస్ గౌడ్, క్రీడాశాఖ మంత్రి

పీవీ సింధు యువతకు ఆదర్శం

సింధు రికార్డు...

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధుకు విశ్వక్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డు సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా ఈమె నిలిచింది. అంతకుముందు వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయవ్యక్తిగా రెజ్లర్ సుశీల్ కుమార్‌ రికార్డు సృష్టించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సుశీల్‌... 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు.

రెండు ఒలింపిక్స్​లో వరుసగా పతకాలు సాధించిన సింధు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. రాష్ట్రపతి నుంచి మొదలుకుని ఎల్లెడలా ఆమె విజయాన్ని కీర్తించారు. సినీ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె ఆటను కొనియాడారు.

ఇదీ చదవండి: సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు

Last Updated :Aug 4, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.