హైదరాబాద్​ నుంచి తప్పించుకున్న చైన్​స్నాచర్స్​.. ప్లాన్​ మామూలుగా వేయలేదుగా!

author img

By

Published : Jan 10, 2023, 8:35 AM IST

Updated : Jan 10, 2023, 8:49 AM IST

chain snatching in Hyderabad

Hyderabad Chain snatching case update: హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడి అలజడి సృష్టించిన నలుగురు ముఠా సభ్యులు భాగ్యనగరాన్ని విడిచివెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తన్నారు. పారిపోయిన ముఠాకోసం 2 కమిషనరేట్ల పోలీసులు మూడురోజులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా నిందితుల జాడ కనిపెట్టలేకపోయారు. గొలుసు దొంగలను ఎలాగైనా పట్టుకొని తీరుతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్​ నుంచి తప్పించుకున్న చైన్​స్నాచర్స్​.. ప్లాన్​ మామూలుగా వేయలేదుగా!

Hyderabad Chain snatching case update: ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలో పదుల సంఖ్యలో దొంగల ముఠాలు ఉన్నాయి. ఒక్కోముఠాలో 4 నుంచి ఆరుగురు సభ్యులుగా ఉంటారు. వారంతా దేశంలోని ప్రధాననగరాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు, దోపిడీలకు దిగేవారు. శామ్లీ జిల్లాలోని అల్గం గ్రామానికి చెందిన పింకు, అశోక్, మరో ఇద్దరు కలిసి శుక్రవారం ఉదయం బెంగళూరులో 10 చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు.

ఆనంతరం ప్రైవేట్‌ వాహనాల్లో మరుసటిరోజు హైదరాబాద్‌ చేరారు. పింకు, అశోక్‌ అబిడ్స్‌ వద్ద శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం చోరీ చేసి వరుస స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఉప్పల్‌ నుంచి రాంగోపాల్‌ పేట పరిధిలో 7 చోట్ల గొలుసు చోరీలు చేశారు. ఇద్దరు నిందితుల కదలికలను గమనిస్తూ మరో ఇద్దరు రక్షణగా ఉన్నారు.

దొంగల స్వస్థలం శామ్లీ జిల్లా యూపీ: గొలుసు దొంగతనానికి తొలుత ఇద్దరే వచ్చినట్లు పోలీసులు అనుమానించినా.. ఆ తర్వాత నలుగురు వచ్చినట్లు నిర్ధరణకు వచ్చారు. నిందితుల కోసం ముమ్మర వేట సాగిస్తున్న హైదరాబాద్, రాచకొండ పోలీసులు దొంగల సొంతూరు శామ్లీ జిల్లాకు రెండుబృందాలను పంపగా వారు స్వస్ధలం చేరినట్లు ఆధారాలు లభించకపోవడం నగరంలో మకాం వేసినట్లు అంచనావేశారు. నిందితులను పట్టుకునేందుకు సోమవారం తెల్లవారుజామున నగర వ్యాప్తంగా నాకాబంధీ చేపట్టారు.

పలు ప్రాంతాలు, వాహనాలను తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఎక్కడా అంతరాష్ట్ర దొంగల ఆనవాళ్లు లభించలేదు. చైన్‌స్నాచర్ల సొత్తును విక్రయించే రిసీవర్లను అదుపులోకి తీసుకున్నా వారి వద్ద ఎలాంటి సమాచారం లభించలేదు. చోరీలు చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద వాహనం వదిలేసి ఆటోలో వివిధ ప్రాంతాలను చుట్టేశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు ఏంజీబీఎస్​ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినట్టు సీసీకెమెరాల ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.

ట్రైన్​లో వెళ్లినట్లు నటించి రోడ్డు మార్గం ద్వారా జంప్: ఏంజీబీఎస్​ వద్ద చివరిసారి కనిపించిన దొంగలు ఎటు వెళ్లారనేది పోలీసులు అంచనావేయలేకపోయారు. అయితే పోలీసులను ఏమార్చేందుకు చాకచక్యంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలోకి వెళ్లినట్లు నటించి.. కొంత సమయం తర్వాత మరోమార్గంలో బయటకు వచ్చారు. రైల్లో ప్రయాణించినట్లు బలంగా నమ్మేలా మస్కా కొట్టారు. ఆ తర్వాత నలుగురు నిందితులు రోడ్డుమార్గంలో హైదరాబాద్‌ దాటి కర్ణాటక లేదా మహారాష్ట్ర చేరినట్లు సమాచారం.

2011లో హైదరాబాద్‌కి పింకుతోపాటు వచ్చిన ముఠా మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 32 చోట్ల గొలుసు చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. గతంలో వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు.. పింకును అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈసారి అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులు యోచిస్తున్నారు.

పోలీసుల పనితీరుపై విమర్శలు: తొలుత చైన్‌స్నాచింగ్‌ జరగ్గానే మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమైతే మిగిలిన చోట్ల గొలుసు దొంగతనాలకు అడ్డుకట్టపడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో రాత్రి విధులు నిర్వర్తించే పోలీస్‌ సిబ్బంది తెల్లవారుజాము నాలుగున్నరకు యాంటీ చైన్‌స్నాచింగ్‌ డ్రిల్‌ నిర్వహించేవారు. తద్వారా తెల్లవారుజామున నడక, పాలు, ఆలయాలకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొనే స్నాచర్లకు అడ్డుకట్ట పడింది.

విధులకు డుమ్మాకొట్టి నిద్రపోయే సిబ్బందిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం నగరవ్యాప్తంగా తిరుగుతూ ఫొటోలు తీయడంతో క్షేత్రసాయిలో ఉదయం సమయంలో అప్రమత్తంగా ఉండేవాళ్లు. గొలుసు చోరీలు తగ్గటంతో క్రమంగా పాతపద్ధతి అటకెక్కింది. ఆ విషయాన్ని ఆసరాగా చేసుకొని దొంగలు గొలుసు చోరీలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Jan 10, 2023, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.