ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు... డబ్బు ఎక్కడిదని సిట్​ ఆరా..

author img

By

Published : Nov 11, 2022, 8:58 AM IST

MLAs Poaching Case Accused Investigation: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ సాగిస్తోంది. తొలి రోజు నిందితులను ఎనిమిది గంటలకుపైగా వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఎరకు డబ్బు ఎక్కడిదని ఆరా తీయనున్నారు. రామచంద్రభారతి వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుందని సిట్‌ భావిస్తోంది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టులో భాజపా మరోసారి వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై నమ్మకం లేదని.. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కోరారు. సిట్‌ అంటే భయమెందుకని భాజపాను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

MLAs Poaching Case Accused Investigation
MLAs Poaching Case Accused Investigation

ఎమ్మెల్యేల ఎర కేసులోని నిందితులను సుదీర్ఘంగా విచారించిన సిట్‌ అధికారులు

MLAs Poaching Case Accused Investigation: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుడు రామచంద్రభారతి వాంగ్మూలం కీలకం అవుతుందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయనే ఎమ్మెల్యేలతో డబ్బుల గురించి మాట్లాడటం, పైలట్‌ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో.. ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ విషయంలో ఆయనను ప్రశ్నించడంపై సిట్‌ దృష్టి పెట్టింది. సిట్‌ ఏర్పాటైన రోజే కేసులోని నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ను రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వడంతో దర్యాప్తు ఆరంభించింది. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. సిట్‌లో సభ్యులుగా ఉన్న డీసీపీలు కల్మేశ్వర్, జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీరెడ్డి ముగ్గురినీ సుదీర్ఘంగా విచారించారు.

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన భాజపా:ఎమ్మెల్యేలతో ఫాంహౌజ్​లో బేరసారాల సందర్భంగా నిందితులు చెప్పిన విషయాలపై ప్రశ్నించగా.. చాలావరకు తమకు తెలియదనే సమాధానమే వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో నిందితులు జరిపిన సంభాషణలపై సిట్‌ ఆరా తీస్తోంది. నిందితుల సెల్‌ఫోన్లను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక అందాక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును నిలిపివేయాలని భాజపా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తును ఆపాలని భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. హైకోర్టు సింగిల్ బెంచ్‌లో కమలదళం వేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఈ కేసును భాజపాపై దుష్ప్రచారానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని పిటిషన్ వేయగా.. ఈ వాదనలపై లోతైన విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరింత సమాచారాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. భాజపా మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

భాజపా నాయకులు దొరికిపోయిన దొంగలు: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా నాయకులు దొరికిపోయిన దొంగలని మంత్రులు హరీశ్​రావు, నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా సిట్ వేసి విచారణ జరుపుతుంటే.. భాజపా నాయకులు ఎందుకు కోర్టులో కేసులు వేస్తున్నారని ప్రశ్నించారు. భాజపాకు సంబంధం లేకపోతే కోర్టుల తలుపులు ఎందుకు తడుతున్నారని కమలం నేతలను మంత్రులు ప్రశ్నించారు. దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని కోరడంలో ఆంతర్యమేంటని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించాలని భాజపా నేతలకు సూచించారు. భాజపా బండారం బయపడుతుందనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ ​రెడ్డి ప్రమాణాలు, కేసుల పేరుతో ఆగమవుతున్నారని విమర్శించారు.

భాజపాకి ఏ మాత్రం నమ్మకం లేదు: ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణ జరగకుండా అడ్డుకునేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెరాస చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని భాజపా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై భాజపాకి ఏ మాత్రం నమ్మకం లేదని ఆ పార్టీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. సీఎం ఉద్దేశాలకు భిన్నంగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఎలా జరపగలదు..? అని వారు ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టు ఫుల్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.

ఇవీ చదవండి: 'ఎమ్మెల్యేల ఎర కేసు'.. దర్యాప్తు నిలిపివేయాలంటూ మరోసారి హైకోర్టుకు భాజపా

సంబంధం లేకపోతే దర్యాప్తు ఎందుకు ఆపాలంటున్నారు: హరీశ్‌రావు

మంచు కొండల్లో మోదీనే బ్రహ్మాస్త్రం.. భారమంతా ఆయనపైనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.