ETV Bharat / state

MLAs Poaching Case: 3 వారాల సమయం కోరిన ప్రభుత్వం.. సీజే పర్మిషన్​ తీసుకోవాలన్న హైకోర్టు

author img

By

Published : Feb 7, 2023, 12:07 PM IST

Updated : Feb 7, 2023, 7:43 PM IST

High Court
High Court

12:02 February 07

ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పు 3 వారాలు నిలిపివేయాలని పిటిషన్

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న తీర్పును మూడు వారాలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ జడ్జిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేసును వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని జస్టిస్ బి.విజయ​సేన్‌ రెడ్డి గతంలో తీర్పు వెల్లడించారు. సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద సవాల్ చేసింది. ప్రభుత్వ అప్పీళ్లను కొట్టివేస్తూ ఈ నెల 6న తీర్పు వెల్లడించింది. ప్రభుత్వ అప్పీళ్లు, సింగిల్ జడ్జి తీర్పులోని అంశాల జోలికి వెళ్లడం లేదని.. క్రిమినల్ కేసుల్లో అప్పీళ్లు తమ పరిధిలోకి రావన్న కారణంగా కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా కొంత సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది.

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా గతంలో ఇచ్చిన తీర్పును 3 వారాలు ఆపాలని సింగిల్ జడ్జి జస్టిస్ విజయసేన్‌రెడ్డిని ప్రభుత్వం ఇవాళ కోరింది. అప్పీళ్లపై విచారణ తమ పరిధిలోకి రాదని ధర్మాసనం పేర్కొన్నందున.. గతంలో ఇచ్చిన తీర్పును ఆపాలని ఇవాళ ఉదయం సింగిల్ జడ్జిని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. లంచ్ మోషన్‌కు అనుమతినిచ్చిన జస్టిస్ విజయసేన్‌ రెడ్డి మధ్యాహ్నం రెండున్నరకు అత్యవసర విచారణ జరిపారు.

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరారు. ప్రభుత్వ అభ్యర్థనపై నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సర్టిఫైడ్ కాపీ అందే వరకూ తీర్పును నిలిపివేస్తూ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారని.. మళ్లీ, మళ్లీ సస్పెండ్ చేయడం తగదన్నారు. ధర్మాసనం విచారణ జరిపిన తర్వాత అదే అంశంపై సింగిల్ జడ్జి మళ్లీ ఆదేశాలు ఇవ్వరాదన్నారు.

సీజే అనుమతి తీసుకోండి..: మరోవైపు కేసు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని.. కేసు ఫైళ్లు ఇవ్వాలని సీఎస్‌కు ఇప్పటికి నాలుగు సార్లు లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదని సీబీఐ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ధర్మాసనం తీర్పునిచ్చిన తర్వాత అదే అంశంపై సింగిల్ జడ్జి విచారణ జరపవచ్చా అనే అంశంపై ప్రధాన న్యాయమూర్తి వద్ద స్పష్టత తీసుకోవాలని ఏజీకి న్యాయమూర్తి సూచించారు. సీజే అనుమతి తీసుకోవాలని సూచించారు. రేపు ఉదయం సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను అనుమతి కోరతామని ఏజీ బీఎస్‌ ప్రసాద్ తెలిపారు.

వివాదం అంతా కోర్టుల చుట్టూనే: ఎమ్మెల్యేలకు ఎర కేసు నమోదైనప్పటి నుంచి.. వివాదం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్ 26న మెయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నాంపల్లి అనిశా ప్రత్యేక కోర్టులో ముగ్గురు నిందితులైన రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను ప్రవేశ పెట్టారు. కోర్టు మాత్రం నిందితుల రిమాండ్‌కు అంగీకరించలేదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ను నమోదు చేశారని.. దీన్ని దర్యాప్తు చేసే పరిధి మెయినాబాద్ పోలీసులకు లేదంటూ అనిశా కోర్టు తిరస్కరించింది.

దీంతో పోలీసులు హైకోర్టుకు వెళ్లి న్యాయమూర్తి ఆదేశాలతో ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తునకు బదిలీ చేసింది. సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మాత్రం సిట్ దర్యాప్తుపై స్టే విధించడానికి నిరాకరిస్తూ.. హైకోర్టు దీని విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తిరిగి హైకోర్టులో సిట్ దర్యాప్తుపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగిన తర్వాత.. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పునిచ్చారు.

ఆ సమయంలో పలు మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్, తుషార్ కపూర్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ నోటీసులివ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 41ఏ సీఆర్పీసీ నోటీసులపై కోర్టు స్టేలు విధిస్తూ వచ్చింది. బీఎల్ సంతోష్, తుషార్‌లను నిందితులుగా చేరుస్తూ మెయినాబాద్ పోలీసులు.. నాంపల్లి అనిశా ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన మెమోలను సైతం కోర్టు తిరస్కరించింది.

సీజే ధర్మాసనంలోనూ పోలీసులకు చుక్కెదురు: హైకోర్టు సింగిల్ బెంచ్‌లో ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ధర్మాసనంలో అప్పీల్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత సీజే ధర్మాసనంలోనూ పోలీసులకు చుక్కెదురైంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీసులున్నారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలును రెండు వారాలపాటు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోరినా.. దానికి ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 7, 2023, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.