ETV Bharat / state

'పేపర్ లీక్ కేసు.. సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్జి విచారణ కావాలి'

author img

By

Published : Apr 1, 2023, 7:52 PM IST

Oppositions on TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో వాస్తవాలు నిగ్గు తేల్చాలంటే.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌ వల్ల ఎలాంటి న్యాయం జరగదన్న నేతలు.. ప్రస్తుతం ఉన్న బోర్డు ప్రక్షాళన చేయకుండా మళ్లీ పరీక్షలు నిర్వహించడంలో.. ఆంతర్యమేంటని ప్రశ్నించాయి. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశాయి.

TSPSC paper leak case
TSPSC paper leak case

Oppositions on TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ పెండింగ్‌లో పెట్టేందుకే సిట్ విచారణ అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. డ్రగ్స్‌ కేసు విచారణ ఎందుకు ఆగిందన్న నల్లు ఇంద్రసేనా రెడ్డి.. డేటాచోరీ, ఓటుకు నోటు కేసులు ఏమయ్యాయో తెలుసని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పేపర్ ఉంచే రహస్య గదికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేకున్నా.. పేపర్లు ఎలా బయటకువచ్చాయని నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు.

నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌చేశారు. అక్రమాలు జరిగిన బోర్డు నేతృత్వంలోనే పరీక్షలు జరపాలని నిర్ణయించడంలో.. ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ పోరాటం వల్లే సర్వీస్‌ కమిషన్‌ సభ్యులకు సిట్‌ నోటీసులు జారీ చేసిందని రఘనందన్‌రావు వివరించారు.

ఏసీబీకి వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్: పేపర్‌ లీకేజీ నగదు లావాదేవీల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేతలు.. ఏసీబీకి వినతిపత్రం సమర్పించారు. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలపై నిగ్గుతేల్చాలని కోరారు. నిరుద్యోగుల విషయంలో పోరాటాన్ని ముమ్మరం చేసిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కలిసి పోరాడుదామని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడారు.

ప్రగతిభవన్ మార్చ్‌కి పిలుపునిద్దాం: ఉమ్మడి కార్యాచరణతో.. ప్రగతిభవన్ మార్చ్‌కి పిలుపునిద్దామని వైఎస్‌ షర్మిల సూచించారు. ఐక్యంగా వెళ్లకుంటే ప్రతిపక్షాలను రాష్ట్రంలో.. కేసీఆర్ బతకనివ్వరని వివరించారు. ఉమ్మడి పోరాటానికి బండి సంజయ్ మద్దతు ఇవ్వగా.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి.

"వాస్తవాలను నిరుద్యోగుల ముందు ఉంచాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వానికి ఏ సంబంధముందని కేటీఆర్ అన్నారు. మేము చేసిన ఆరోపణలను రాజకీయ ఆరోపణలని అంటున్నారు. మాకు నోటీసులు ఇస్తామని అంటున్నారు. వెంటనే టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలి. ఈ కేసును సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలి." - రఘనందన్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే

"టీఎస్‌పీఎస్సీ కేసుపై ఏసీబీకి వినతిపత్రం ఇచ్చాం. మీరు దర్యాప్తు చేయాలని కోరాం. లేకపోతే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం." -మల్లు రవి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

ఇవీ చదవండి: పేపర్ లీకేజీ కేసు.. ముగిసిన టీఎస్​పీఎస్సీ ముఖ్య అధికారుల విచారణ

'మనం కలిసి పోరాడదాం'.. బండి సంజయ్, రేవంత్​లతో వైఎస్ షర్మిల

నేవీ చీఫ్​కు​ కొవిడ్ పాజిటివ్​​.. ఆ ప్రోగ్రాం క్యాన్సిల్.. హఠాత్తుగా దిల్లీకి తిరుగు పయనం

రాహుల్​ గాంధీపై మరో పరువు నష్టం కేసు.. RSSను అలా అన్నారని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.