ETV Bharat / bharat

పేపర్ లీకేజీ కేసు.. ముగిసిన టీఎస్​పీఎస్సీ ముఖ్య అధికారుల విచారణ

author img

By

Published : Apr 1, 2023, 7:21 AM IST

Updated : Apr 1, 2023, 4:24 PM IST

TSPSC Secretary Attends SIT Inquiry today: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ క్రమంలోనే కార్యదర్శి అనితా రామచంద్రన్​, కమిషన్‌ సభ్యుడు లింగారెడ్డి విచారణ వేర్వేరుగా ముగిసింది. పేపర్ లికేజీ, ప్రవీణ్‌కు సంబంధించిన అంశాలపై సిట్.. ఇరువురు అధికారులను ప్రశ్నించింది.

SIT officials will interrogate the celebrities
ప్రముఖులను విచారించనున్న సిట్​ అధికారులు

TSPSC Secretary Attends SIT Inquiry today: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిట్‌ కార్యాలయానికి హాజరైన అనితా రామచంద్రన్ విచారణ మధ్యాహ్నం ముగిసింది. ప్రవీణ్‌కు సంబంధించిన అంశాలపై ఆమెను అధికారులు ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పరిపాలన, కాన్ఫిడెన్షియల్ విభాగంపై విచారించారు. ఇందులో భాగంగానే అనితా రామచంద్రన్‌ స్టేట్​మెంట్​ను అధికారులు రికార్డ్ చేశారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనితా రామచంద్రన్ వద్ద పీఏగా ప్రవీణ్ పనిచేస్తున్నాడు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్..
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి 103 మార్కులు సాధించాడు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి కూడా ఇవాళ సిట్ విచారణ ముందు హాజరయ్యారు. కార్యదర్శి అనితా రామచంద్రన్‌ విచారణ తరువాత... లింగారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. లీకేజ్‌ కేసులో నిందితుడిగా ఉన్న రమేశ్.. లింగారెడ్డి వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు.

మరోవైపు గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో వందకుపైగా మార్కులు సాధించినవారిలో ఇప్పటి వరకూ వంద మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడ్రోజుల్లో ప్రశ్నించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్ ద్వారా పరీక్ష రాసిన వారితో సహా మొత్తం 15మందిని అరెస్టు చేశారు. ఎంత మందికి ప్రశ్నపత్రాలు చేరాయి, వారి ద్వారా ఎవరికి నగదు అందిందనే కోణంలో సిట్ అధికారులు వారిని ప్రశ్నించనున్నారు.

SIT Inquiry in TSPSC paper leak case : ప్రశ్నపత్రం ఎలా లీక్ అయిందనే విషయమై ఇప్పటికే స్పష్టత వచ్చింది. కాన్ఫిడెన్సియల్ విభాగం ఇంఛార్జి శంకరలక్ష్మీ యూజర్‌ ఐడీ, పాస్వర్డ్ కొట్టేసి ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దాంతో దర్యాప్తు అంతా ప్రశ్నపత్రాలు ఎవరెవరికి లీక్ అయ్యాయి అనే కోణంలో ఉంటుందని భావించారు. కానీ ఇప్పడు అనూహ్యంగా సిట్ అధికారులు కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డిని విచారణకు పిలవటం చర్చనీయాంశంగా మారింది. వారికి ఇప్పటికే అధికారులు నోటీసులు పంపించి ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు.

TSPSC paper leak case update: కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, పరీక్షల నిర్వహణ తదితర విషయాల గురించి కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వద్ద పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రశ్నపత్రాలు కొల్లగొట్టినందున ఆ కోణంలోనూ అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ను గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ, విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న ప్రశ్నలకు కమిషన్‌ కార్యదర్శి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రమేశ్ అనే వ్యక్తికి కూడా లీకైన గ్రూప్-1 ప్రశ్నపత్రం అందింది. కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద రమేశ్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ రమేష్‌ను ఎందుకు విధుల్లో కొనసాగించారనే కోణంలో సిట్ అధికారులు లింగారెడ్డిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 1, 2023, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.