ETV Bharat / state

Omicron cases in telangana: రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. హైదరాబాద్​లో 2 కేసులు నమోదు

author img

By

Published : Dec 15, 2021, 11:07 AM IST

Updated : Dec 15, 2021, 2:04 PM IST

omicron cases in telangana
రాష్ట్రంలో తొలిసారిగా 2 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

11:06 December 15

రాష్ట్రంలో తొలిసారిగా 2 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

రాష్ట్రంలో తొలిసారిగా 2 ఒమిక్రాన్‌ కేసులు నమోదు: డీహెచ్​

Omicron cases in telangana: రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించామని.. ఆమెను చికిత్స నిమిత్తం గచ్చిబౌలి టిమ్స్​ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఒమిక్రాన్‌ సోకలేదన్న డీహెచ్‌ ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమాలియా నుంచి వచ్చిన యువకుడి ఆచూకీని హైదరాబాద్ పారామౌంట్​ కాలనీలో​ పోలీసులు గుర్తించారు. బాధితుడిని నేరుగా టిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.

శాంపిల్స్​ సేకరించాం

ఒమిక్రాన్ సుమారు నెల రోజుల్లో 77 దేశాల్లో వ్యాప్తి చెందిందని డీహెచ్​ అన్నారు. భారత్​లో కర్ణాటక, దిల్లీ, గుజరాత్, ఏపీ రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని చెప్పారు. ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి విదేశాల నుంచి మొత్తం 5,396 మంది వచ్చారని పేర్కొన్న డీహెచ్​.. అందులో 18 మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. 15 మందికి ఒమిక్రాన్ నెగిటివ్​గా తేలినట్లు చెప్పారు. మరో ముగ్గురికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. తెలంగాణలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న డీహెచ్​.. బాధితుల కుటుంబసభ్యుల శాంపిల్స్​ సేకరించినట్లు తెలిపారు.

జీనోమ్​ సీక్వెన్సింగ్​లో నిర్ధరణ

'రాష్ట్రంలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆ ఇద్దరూ ఈ నెల 12న రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయింది. బాధితులను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్​ ఆస్పత్రికి తరలించాం. -శ్రీనివాస్​ రావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు

అప్రమత్తత అవసరం

Omicron cases: బంగాల్​కు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్​ నిర్ధరణ కావడంతో ఆ చిన్నారిని.. విమానాశ్రయం నుంచి నేరుగా బంగాల్​ పంపించినట్లు డీహెచ్​ చెప్పారు. అక్కడి అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ను కొవిడ్‌ నియమాలతో నియంత్రించవచ్చని.. వ్యాక్సిన్‌ వేసుకున్నా అప్రమత్తత అవసరమని డీహెచ్‌ సూచించారు. ఒమిక్రాన్​ కేసులతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైందని.. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.

వదంతులు నమ్మొద్దు

'ఒమిక్రాన్ వేరియంట్​పై ప్రజలు వదంతులు నమ్మవద్దు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒమిక్రాన్‌ కూడా గాలి ద్వారానే సోకుతుంది. విదేశాల నుంచి రాష్ట్రానికి 5.396 మంది వచ్చారు. పండుగలు, ఫంక్షన్లు కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలి. ఒమిక్రాన్‌ కట్టడిపై సీఎం ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు.'

-శ్రీనివాస్​ రావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు

టీకాతోనే రక్ష

థర్డ్​ వేవ్​ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని.. కొత్త వేరియంట్ ఎలా పని చేస్తుందో సరిగా చెప్పలేమని డీహెచ్​ పేర్కొన్నారు. రీ ఇన్ఫెక్షన్ కేసులు ఒమిక్రాన్​తో వెలుగు చూస్తున్నాయని.. ఒమిక్రాన్​ లక్షణాలు చాలా స్వల్పం.. కానీ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి టెస్టింగ్​ పెంచుతామని రాష్ట్రంలో 50 శాతం మాస్కుల వినియోగం పెరిగిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్​ను సైతం కొవిడ్ నియమాలు పాటించి నియంత్రించవచ్చని సూచించారు. వ్యాక్సినేషన్ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కాపాడుతుందని.. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 శాతం మందికి మొదటి డోస్ పూర్తయిందని వివరించారు.

ఇదీ చదవండి: Errabelli comments on central Govt : 'కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి మరోమారు బట్టబయలైంది'

Last Updated :Dec 15, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.