Delhi Liquor Scam: కదులుతోన్న డొంక.. తెలుగు వారికి బిగుసుకుంటున్న ఉచ్చు..

author img

By

Published : Sep 26, 2022, 7:33 AM IST

Updated : Sep 26, 2022, 10:36 AM IST

దిల్లీ మద్యం కేసు
దిల్లీ మద్యం కేసు ()

Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం కేసుకు సంబంధించి తీగ లాగితే డొంక కదులుతోంది. కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బినామీలకు పలువురు ప్రముఖులతో సంబంధమున్నట్లు సమాచారం. తనిఖీల్లో లభించిన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అందించినట్లు తెలిసింది.

దిల్లీ మద్యం కేసులో తెలుగు వారికి బిగుసుకుంటున్న ఉచ్చు.. ఈడీతో పాటు ఆదాయపన్ను శాఖ రంగంలోనికి..

Delhi Liquor Scam Case: ఒక్క కేసు వందకుపైగా ఖాతాల ప్రవాహాన్ని పట్టించింది. వాటిమాటున దాగిన బినామీ వ్యక్తులు, వారి వెనుక ఉన్న పెద్దల బండారాన్ని బట్టబయలు చేయబోతోంది. ఎక్కడో దిల్లీలో మొదలైన.. మద్యం కేసు ఇప్పుడు అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల మెడకు చుట్టుకోబోతోందని.. ఇందులో అనేకమంది ప్రజాప్రతినిధులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు: మద్యంకేసులతో సంబంధం ఉన్న వారు కొద్దిమందే అయినా ఇతరత్రా వ్యాపారకార్యకలాపాలు, అనధికారిక పెట్టుబడి, నల్లధనాన్ని చట్టబద్ధంచేసే యత్నానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారానికి సంబంధించి తెలుగురాష్ట్రాల్లో ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఆ కేసులో సీబీఐ నిందితునిగా చేర్చడంతో అయనతో కలిసి వ్యాపారాలుచేస్తున్న వారిపైనా దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెట్టాయి.

రామచంద్రపిళ్లై కార్యాలయం సోదాలు: అందులోభాగంగా తొలుత రామచంద్రపిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఆనంతరం ఆయనతో వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న బోయినపల్లి అభిషేక్, ప్రేమసాగర్‌ గండ్ర తదితరులపై దృష్టి సారించింది. వాస్తవానికి అంతటితో ఈడీ దర్యాప్తు పూర్తవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మద్యం ముడుపులకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి దోమల్‌గూడకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ సంస్థ ఆడిట్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

గోరంట్ల కార్యాలయంలో: అక్కడ చేసినన సోదాలు మద్యంకేసుదర్యాప్తును మలుపుతిప్పినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో సంస్థలు, వాటికి సంబంధించి వందకుపైగా ఖాతాల వివరాలు ఈడీ చేతికి చిక్కినట్లు సమాచారం. వెన్నమనేని శ్రీనివాసరావు విషయం.. అలాగే బయటకొచ్చింది. గోరంట్ల కార్యాలయంలో సోదాలు చేసేవరకు ఆయనెవరో ఈడీ అధికారులకు తెలియదు. అక్కడ లభించిన పత్రాల ఆధారంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చెందిన వివిధ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థల పేర్లు: రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు శ్రీనివాసరావు బినామీ కావచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరో రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థల పేర్లు అలాగే వెలుగులోకి రావడంతో వాటిలో సోదాలుచేశారు. తనిఖీల్లో బయటపడిన సంస్థలు, ఖాతాల్లో కొన్నింటికి మద్యం కేసుతో సంబంధంలేకపోయినా అనుమానాస్పద లావాదేవీలున్నందున వాటిని విడిగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు బినామీలేనని, వారుఎవరికి బినామీలనేది నిగ్గుతేలితే మరోమారు రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

వారిపై ఆదాయపన్ను చట్ట నిబంధనల ప్రకారం బినామీ నిరోధక చట్టం ప్రయోగించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈడీ సోదాల్లో వెల్లడైన వివరాలను ఇప్పటికే ఆదాయపన్నుశాఖకు అందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ శాఖ రంగంలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 26, 2022, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.