Martyrs Memorial in Hyderabad : 'జూన్​ 1న అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం'

author img

By

Published : May 5, 2023, 8:29 PM IST

Prashanth Reddy
Prashanth Reddy ()

Martyrs Memorial in Hyderabad : హైదరాబాద్​ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. సాగరతీరాన.. అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా నిర్మించిన స్మారకాన్ని.. జూన్ ఒకటో తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. నిర్మాణ పనులను ఈరోజు మంత్రి పరిశీలించారు.

Martyrs Memorial in Hyderabad : స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్​సాగర్ తీరాన ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్మారకం ప్రారంభోత్సవం అవుతుందన్నారు.

అమరవీరుల ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునేలా ఏర్పాట్లు ఉండబోతున్నాయని తెలిపారు. స్మారకాన్ని పరిశీలించిన మంత్రి.. పనుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్, పార్కింగ్ ప్రాంతాలు, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫొటో గ్యాలరీ, ఆడియో-విజువల్ రూం, లిఫ్ట్​లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్తులోని రెస్టారెంట్, నిరంతరం జ్వలించేలా ఉండే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని... అరుదైన స్టెయిన్​లెస్ స్టీల్​తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్టెయిన్​లెస్ స్టీల్​తో నిర్మించిన అరుదైన అతిపెద్ద కట్టడం ప్రపంచంలో ఇదేనని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమన్న ఆయన.. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పని చేయాలని అధికారులు, గుత్తేదారులను కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని, గడువులోగా పనులు పూర్తయ్యేలా సిబ్బందిని పెంచాలని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

"తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ప్రతిష్ఠాత్మకంగా అమరవీరుల స్మారకం నిర్మాణం ప్రారంభించాం. వచ్చే నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్మారకం ప్రారంభోత్సవం అవుతుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అరుదైన స్టెయిన్ స్టీల్​తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో నిర్మిస్తున్నాం. స్టెయిన్​లెస్ స్టీల్​తో నిర్మించిన.. ప్రపంచంలో అతి పెద్ద, అరుదైన కట్టడం". - ప్రశాంత్​రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.