ETV Bharat / state

Niranjan reddy: 'ఆత్మస్ధైర్యం పెరగడం వల్లే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి'

author img

By

Published : Jul 28, 2021, 4:35 PM IST

minister niranjan reddy, farmers suicide
రైతుల ఆత్మహత్యలు, మంత్రి నిరంజన్ రెడ్డి

సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతోనే రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ముందు చూపుతోనే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు.

ఆత్మస్థైర్యం పెరగడం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని... వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ అంటూ పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించిన గణాంకాలను మంత్రి గుర్తు చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 2018లో రైతుబంధు పథకం అమలు తర్వాత 2019లో 491కి రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని.. పార్లమెంటులో కేంద్రం ఈ సమాధానం చెప్పడం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ముందు చూపునకు నిదర్శనమని మంత్రి వివరించారు. రైతుబంధుపై సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల వ్యవసాయ విధానాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు.

ఆత్మవిమర్శ చేసుకోవాలి

నిపుణుల సలహాలతో 6 నెలలు మేధోమథనం చేసిన సీఎం... రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు. రైతుబంధుపై రాజకీయం చేసే వారు కేంద్రం ఇచ్చిన సమాధానం పరిశీలించి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్​ నాయకత్వంలో వ్యవసాయరంగం మాదిరిగానే భవిష్యత్తులో దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పెద్దపీట

వ్యవసాయ రంగం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనీ... ప్రతి పౌరుడు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని నిరంజన్​ రెడ్డి అన్నారు. 60 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తే.. తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, సాగు నీటి కల్పన, మద్దతు ధరలకు పంటల కొనుగోలు వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: KTR: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.