KTR Review on TS BPASS: టీఎస్​బీపాస్​ దేశంలోనే ఆదర్శంగా నిలవాలి: కేటీఆర్

author img

By

Published : Dec 27, 2021, 8:08 PM IST

KTR Review on TS BPASS

KTR Review on TS BPASS: పురపాలకశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్​ పలు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఆరా తీశారు. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్​బీపాస్​ను దేశంలో ఆదర్శంగా నిలిచేలా వ్యవస్థ రూపొందించాలని ఆదేశించారు.

KTR Review on TS BPASS: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్​బీపాస్​ను దేశంలో ఆదర్శంగా నిలిచేలా వ్యవస్థ రూపొందించాలని అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పురపాలకశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి.. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఆరా తీశారు. పట్టణ ప్రగతికి అదనంగా టీయూఎఫ్ఐడీసీ సంస్థ నిధులు పెద్దఎత్తున పురపాలికలకు అందించడం ద్వారా పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా సమకూరుస్తున్నట్లు మంత్రి చెప్పారు.

భవన నిర్మాణ అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్​ బీపాస్ అమలు తీరును మంత్రి కేటీఆర్ సమీక్షించారు. తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా బలోపేతం చేశామన్న అధికారులు ప్రస్తుతం పౌరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో టీఎస్​ఐపాస్ తరహాలోనే భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకు సంబంధించి.. టీఎస్​బీపాస్​ను సైతం దేశానికి ఆదర్శంగా నిలిచే వ్యవస్థగా మార్చాలని తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్​ఆర్​డీపీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి ఇందులో భాగంగా చేపట్టిన రెండు కీలక ఫ్లైఓవర్లను ఈ వారంలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక కార్పొరేషన్లు, పురపాలికల మాస్టర్ ప్లాన్ల తయారీ ప్రక్రియ పూర్తైందన్న కేటీఆర్... కొత్త మున్సిపాల్టీల్లోనూ వీలైనంత మాస్టర్ ప్లాన్లు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయండి

హైదరాబాద్ పరిధిలో కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. జలమండలి ఎండీ దానకిశోర్, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జలమండలి చేపడుతున్న పనులపై చర్చించారు. ఇప్పటికే మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉందన్న కేటీఆర్... కొత్త ఎస్టీపీల నిర్మాణం కూడా పూర్తైతే పూర్తి స్థాయిలో మురుగునీటి శుద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుందని అన్నారు.

ఎస్టీపీలను ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పచ్చటి ఉద్యాన‌వ‌నాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు మంత్రి సూచించారు. న‌గ‌ర‌ వాసుల‌కు విహార కేంద్రాలుగా మార్చాలని తెలిపారు. న‌గ‌రం వేగంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో శివారు ప్రాంతాలపై కూడా దృష్టి సారించాలని కేటీఆర్ తెలిపారు. బాహ్యవలయ రహదారి అవ‌త‌ల కూడా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని నూత‌న ఎస్టీపీల నిర్మాణం కోసం అంచ‌నాలు రూపొందించాల‌ని చెప్పారు. ఓఆర్ఆర్ రెండో దశలో భాగంగా ఆయా గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా, మౌలిక సదుపాయల కోసం రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టిన జలమండలి చేపడుతున్న పనులను ఏడాదిలోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.