ETV Bharat / state

KTR Letter To Central Minister: 'బయ్యారంపై కేంద్రానిది తుక్కు సంకల్పం'

author img

By

Published : Feb 20, 2022, 8:02 PM IST

KTR Letter To Central Minister: బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే బయ్యారం ప్లాంట్ నిర్మాణానికి శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్​కు కేటీఆర్​ లేఖ రాశారు.

KTR
KTR

KTR Letter To Central Minister: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన హామీ అని... బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. నిండు పార్లమెంట్​లో భారత ప్రభుత్వం ఒప్పుకున్న నిర్ణయాన్ని నరేంద్ర మోదీ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. న్యాయంగా దక్కాల్సిన ఎన్నో విభజన హామీలను పక్కన పెట్టినట్టుగానే బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా భాజపా ప్రభుత్వం కావాలని పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.

ప్రధానిని కలిసినా నిష్ప్రయోజనం...

సూమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికను లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఒకవేళ బయ్యారంలో సరిపడా నాణ్యమైన నిల్వలు లేకపోవడమే కారణం అయినా... కేవలం 180 కిలోమీటర్ల స్వల్ప దూరంలోని ఛత్తీస్​గఢ్​లోని బైలడిల్లలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని కేటీఆర్ తెలిపారు. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణా చేసేందుకు ఒక స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశారని వెల్లడించారు.

కక్ష్యపూరిత ధోరణి...

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనుల నుంచి బయ్యారం ప్లాంట్​కు సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్‌యండీసీ అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేసిన కేటీఆర్... మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్​టెంట్స్ (మేకాన్) సంస్థ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్ర్కాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అంశాలపైన సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్‌యండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా స్పందించినా కేంద్రం మాత్రం బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుపైన నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఛత్తీస్​గఢ్​, జార్ఖండ్ రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాల కోసం కేంద్రం, ఎన్ఎండీసీ, స్థానిక ప్రభుత్వాలతో స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థలు ఏర్పాటైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదన్నారు.

ఒక్క రూపాయి కూడా ఇవ్వలే..

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని రూర్కెలా, బర్న్​పూర్, దుర్గాపూర్ బొకారో, సాలెం ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణ, గనుల కోసం దాదాపు సూమారు రూ. 71 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. పాత కర్మాగారాల ఆధునికీకరణ ఆహ్వానించదగ్గదే అయినా... వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశాక స్టీల్ అథారిటీ అఫ్ ఇండియాను అప్పనంగా అమ్మేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

కేంద్రానిది తుక్కు సంకల్పం...

గతంలో హైదరాబాద్​లో జరిగిన ఎన్ఎండీసీ సంబరాల్లో పాల్గొన్న అప్పటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ కొత్తగూడెం, పాల్వంచలో పెల్లెటైజేషన్ ప్లాంట్, స్ర్కాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మాటలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ఇలా అబద్ధాల ప్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ప్యాక్టరీలు పెట్టడం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై తన లేఖలో దుయ్యబట్టారు. ఆయన ప్రకటనతో బయ్యారంపై కేంద్ర భాజపా బండారం బయటపడిందన్నారు. బయ్యారం ఉక్కుపై కేంద్రానిది కేవలం తుక్కు సంకల్పమే అని తేలిపోయిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ విభజనను తప్పుపడితే.. ఇక్కడి తెలంగాణ మంత్రి విభజన హమీలను తప్పుపడుతున్నారని.. ఇది ముమ్మాటికీ తెలంగాణకు ద్రోహమే అన్నారు.

ఇప్పటికైనా...

తెలంగాణ ప్రయోజనాలు... హక్కులను సాధించడం కోసం మా ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ దిశగా కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ పట్ల తన వివక్ష పూరిత వైఖరి వదిలిపెట్టి బయ్యారంలో వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిది: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.