ETV Bharat / state

KTR IN US: దేశానికే గర్వకారణం తెలంగాణ: మంత్రి కేటీఆర్

author img

By

Published : Mar 24, 2022, 7:14 AM IST

KTR IN US: ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడుతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికే గర్వకారణం రాష్ట్రం నిలుస్తోందని కొనియాడారు. పెట్టుబడుల సాధనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ బుధవారం మిలి పిటాస్‌లో ప్రవాస ప్రముఖుల సమావేశంలో అనంతరం ఐటీసర్వ్‌ అలయన్స్‌ నిర్వహించిన తెలంగాణలో ఐటీ ప్రగతి కార్యక్రమంలో మాట్లాడారు.

KTR IN US
మిలి పిటాస్‌లో ప్రవాస ప్రముఖుల సమావేశంలో మంత్రి కేటీఆర్

KTR IN US: ఆవిర్భవించిన ఏడున్నరేళ్ల కాలంలో అద్భుత ప్రగతిని సాధించి, తెలంగాణ భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తోందని, ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యంతో సీఎం కేసీఆర్‌ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నారని చెప్పారు. ఐటీ అంటే కేవలం హైటెక్‌ సిటీ అనే భావనను తమ ప్రభుత్వం మారుస్తోందని, హైదరాబాద్‌ నలుమూలలతో పాటు తెలంగాణలోని ఇతర పట్టణాలకు కూడా ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పురోగతిలో తెలంగాణ ప్రవాసులు పాలుపంచుకోవాలని కోరారు. పెట్టుబడుల సాధనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ బుధవారం మిలి పిటాస్‌లో ప్రవాస ప్రముఖుల సమావేశంలో, అనంతరం ఐటీసర్వ్‌ అలయన్స్‌ నిర్వహించిన తెలంగాణలో ఐటీ ప్రగతి కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఏడేళ్ల క్రితం క్రితం ఇక్కడే పసికూన లాంటి రాష్ట్రాన్ని మీకు పరిచయం చేశాను. ఇప్పుడు అన్ని రంగాల్లో విజేతగా నిలిచిన తెలంగాణ గాథను చెప్పడానికి మళ్లీ వచ్చాను. ఇందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. రాష్ట్రంలో 19,000 కంటే ఎక్కువ పరిశ్రమలకు అనుమతులివ్వడంతో రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయి. తెలంగాణకు దేశవిదేశాల నుంచి కంపెనీలు వస్తున్నాయి. అమెరికాలోని పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పుట్టినగడ్డకు మేలు చేసేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో దత్తత తీసుకొని ప్రభుత్వ సంకల్పానికి మద్దతునివ్వాలి’’ అని కేటీఆర్‌ కోరారు. రెండు గంటలపాటు సాగిన మంత్రి ప్రసంగంపై ఐటీ నిపుణులు, ప్రవాసులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.

కంపెనీలతో చర్చలు
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ శాన్‌జోస్‌లోని లూసిడ్‌ మోటార్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈవో పీటర్‌ రావ్లిన్‌సన్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సంస్థ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించాలని కోరారు. అనంతరం ఆయన అప్లైడ్‌ మెటీరియల్స్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఓం నలమాసుతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు.

అమెరికాతో తెలంగాణకు ఆత్మీయ అనుబంధం
తెలంగాణకు అమెరికాతో ఆత్మీయ అనుబంధం ఉందని, హైదరాబాద్‌లో ఆ దేశం భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రసిద్ధ సంస్థలన్నీ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్‌ జనరల్‌ ఏర్పాటు చేసిన అమెరికన్‌ పెట్టుబడిదారుల సదస్సులో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు. అమెరికా పారిశ్రామికవేత్తల బృందం హైదరాబాద్‌ను సందర్శించాలని కోరారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.