ETV Bharat / state

KTR In Assembly: 'నాడు అచ్చేదిన్​ అన్నారు... అది కాస్త చచ్చేదిన్​ అయింది'

author img

By

Published : Mar 10, 2022, 5:13 PM IST

Updated : Mar 11, 2022, 12:12 AM IST

KTR In Assembly
ktr

KTR In Assembly: బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై మంత్రి కేటీఆర్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అండగా నిలవాలని ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'సబ్​కా సాత్​ సబ్​కా వికాస్'​ అంటే ఇదేనా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం అందమైన నినాదాలు ఇవ్వడం వరకే పరిమితమైందని.. వారికి స్పష్టమైన పాలసీలు ఏం ఉండవంటూ విమర్శించారు.

KTR In Assembly: 'నాడు అచ్చేదిన్​ అన్నారు... అది కాస్త చచ్చేదిన్​ అయింది'

KTR In Assembly: రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల ప్రకటనపై మంత్రి కేటీఆర్​ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. బడ్జెట్​ పద్దులపై చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సుమారు 90 వేల ఉద్యోగాలు ప్రకటన చేయడం చరిత్రగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్​రెడ్డి, సైదిరెడ్డిని మంత్రి కేటీఆర్​ అభినందించారు. తమ నియోజకవర్గాల్లో కోచింగ్​ సెంటర్లు ఏర్పాటుచేసేందుకు మందుకురావడంపై ప్రశంసించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీధర్​బాబు సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ముందుకురావాలని కోరారు. ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

లక్ష మందికి చేనేత బీమా..

తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్​ అన్నారు. గత అక్టోబర్​లో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రాష్ట్ర అభివృద్ధిపై నివేదిక విడుదల చేసినట్లు చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా కొన్ని రంగాలను ఎంచుకున్నట్లు కేటీఆర్​ వెల్లడించారు. చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అనేక పార్కులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. వరంగల్​, సిరిసిల్ల సహా పలు చోట్ల ఏర్పాటుచేసిన టెక్స్​టైల్​ పార్క్​లకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరినా వారు.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'సబ్​ కా సాత్​ సబ్​​ కా వికాస్' అంటే ఇదేనా అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ​చేనేత రంగానికి తెరాస ప్రభుత్వం చేయూతనిచ్చిన విధంగా.. ఎవరూ అండగా నిలవలేదని స్పష్టం చేశారు. త్వరలో లక్ష మంది చేనేత కార్మికులకు చేనేత బీమా కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మంత్రి కేటీఆర్​ అన్నారు.

హైదరాబాద్​.. 'వ్యాక్సిన్​ క్యాపిటల్​ ఆఫ్​ వరల్డ్'​..

దేశంలో సుమారు 35 నుంచి 40 శాతం ఫార్మా ప్రొడక్ట్స్​ కేవలం హైదరాబాద్​లోనే తయారవుతున్నాయని కేటీఆర్​ చెప్పారు. లైఫ్​సైన్స్​ రంగంలో హైదరాబాద్​ మొదటి వరుసలో ఉందన్నారు. హైదరాబాద్​ వ్యాక్సిన్​ క్యాపిటల్​ ఆఫ్​ వరల్డ్​గా అవతరించిందని కేటీఆర్​ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ హైదరాబాద్​లో పెడుతున్నామన్న మంత్రి.. దానికి కొందరు అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డుపడినా.. పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకెళ్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. జీనోమ్​ వ్యాలీని మరో 200 ఎకరాలు విస్తరిస్తామని చెప్పారు.

ట్రాక్టర్ల నుంచి హెలికాప్టర్ వరకు...

విధ్వంసం నుంచి వికాసం వరకు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామని కేటీఆర్​ స్పష్టం చేశారు. టీఎస్​ ఐపాస్​ దేశానికే ఓ మోడల్​గా తయారైందని చెప్పారు. ట్రాక్టర్ల నుంచి హెలికాప్టర్ వరకు... యాప్స్​ నుంచి గూగుల్​ మ్యాప్స్​ వరకు.. టైల్స్​ నుంచి టెక్స్​టైల్స్​ వరకు అన్నింటా తెలంగాణ ప్రగతిపథంలో దూసుకెళ్తోందని కేటీఆర్​ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 56 పార్కులు పెట్టిన ఘనత తెరాస నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. పుడ్​ ప్రాసెసింగ్​ జోన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 90 చోట్ల స్థలాలు గుర్తించామన్న కేటీఆర్​.. తొలి విడతగా 14 చోట్ల ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.

అయితే జుమ్లా లేకుంటే హమ్లా..

ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కేవలం అందమైన నినాదాలు ఇవ్వడం వరకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. వారికి స్పష్టమైన పాలసీలు ఏం ఉండవంటూ విమర్శించారు. 'ఆత్మ నిర్భర్​ భారత్'​ ఏమైందో అందరికీ తెలుసన్న కేటీఆర్​.. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. ఈ పథకం ప్రకటన సమయంలో అచ్చేదిన్​ అంటూ చెప్పారని.. అది కాస్త చచ్చేదిన్​ అయిందన్నారు. అయితే 'జుమ్లా లేకుంటే హమ్లా' అనే విధంగా కేంద్రం తీరు ఉందని మంత్రి కేటీఆర్​ వ్యంగ్యాస్రాలు సందించారు.

కొత్తగా 'బేచో ఇండియా స్కీం' తీసుకొచ్చారు..

వైజాగ్​ స్టీల్​ ప్రైవేటీకరణపైనా స్పందించిన కేటీఆర్​.. కేంద్రతీరును తప్పుపట్టారు. ప్రణాళిక ప్రకారం నష్టాల్లోకి నెట్టేప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐరన్​ ఓర్​ గనులను రద్దు చేసి.. నష్టాలు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని సింగరేణిని కూడా అమ్మేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో చేసిన విధంగా సింగరేణికి సొంత గనులు కేటాయించాలని కోరినా ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే జాగ్రత్త పడకపోతే.. వైజాగ్​ స్టీల్​ ప్లాంట్​ కార్మికుల మాదిరిగా.. తెలంగాణ ప్రజలు కూడా రోడ్డెక్కె పరిస్థితి వస్తుందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా 'బేచో ఇండియా స్కీం' తీసుకొచ్చారని.. అందులో భాగంగా సంస్థలను ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారని ఆరోపించారు.

ఇదీచూడండి: HARISH RAO ON BUDGET: అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్: హరీశ్ రావు

Last Updated :Mar 11, 2022, 12:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.