ETV Bharat / state

KTR: 'దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది'

author img

By

Published : Jun 30, 2021, 4:23 PM IST

దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు, యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్​ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ సమక్షంలో విస్తృత సమావేశం జరిగింది.

Minister
కేటీఆర్

రాష్ట్రంలో పండుతున్న వరితో పాటు, ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఆయిల్ ఫాం వంటి నూతన పంటల భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు (Food Processing sez), యూనిట్లు ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్​తో పాటు వ్యవసాయ, పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖల అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ నాంది...

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలైన మహబూబ్​నగర్ లాంటి జిల్లాలు మొదలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ప్రాజెక్టుల నీటితో కలకళలాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందని తెలిపారు. దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందన్నారు. మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్రంలో మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయకుండా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా, పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

అన్ని రకాల మౌలిక వసతులు...

రాష్ట్రంలో పండుతున్న పంటల ఫుడ్ మ్యాప్​ను పరిశ్రమల శాఖ తయారు చేసిందని... ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పండేందుకు అవకాశాలు ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు వివరించిన అధికారులు... ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కనిష్ఠంగా 225 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ జోన్లలో విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, ఉమ్మడి శుద్ధి ప్లాంటు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయని చెప్పారు.

ఎమ్మెల్యేలు చొరవ చూపాలి...

రాష్ట్రంలో ప్రధానంగా పండుతున్న వరి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలను పరిగణలోకి తీసుకొని యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్​ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం పిలిచిన ఆసక్తి వ్యక్తీకరణకు సుమారు 350 దరఖాస్తులు అందాయని అధికారులు మంత్రులకు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి స్థానిక రైతుల నుంచి ఇప్పటికే పలు డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అవసరమైన భూసేకరణ వంటి అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ చూపించాలని కేటీఆర్​ సూచించారు.

వ్యవసాయానికి అండ...

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అద్భుతమైన అండ లభించిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక ప్రగతి మరింతగా ముందుకు పోవాలంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతిపాదిత జోన్లతో రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు పెరుగుతాయని, వారి ఉత్పత్తులకు దీర్ఘకాలంలో లాభసాటి ధరలు లభిస్తాయాన్న ఆశాభావాన్ని నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం తయారుచేసే ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ఈ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయన్నాయన్నారు.

ధాన్యం ఉత్పత్తి పెరిగింది...

రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగిందని.. అందుకనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యం పెంచడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల కాలంలోనే ఎఫ్​సీఐ (FCI)కి అందించడంలో ప్రతి ఏడాది ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ఇబ్బందులను అధిగమించేందుకు మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చేలా నూతన పాలసీ రూపొందించాలని గంగుల కోరారు. పారా బాయిల్డ్, స్టీమ్ మిల్లులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని... అందుకనుగుణంగా జోన్లలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మిల్లింగ్ సామర్థ్యం పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి కమలాకర్ అన్నారు.

ఇదీ చదవండి: షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత.. కృష్ణాజలాల ట్వీట్​పై సీమ రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.