ETV Bharat / state

KTR: 'ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదు.. అక్కడ కూడా దళితబంధు ఇస్తాం'

author img

By

Published : Oct 4, 2021, 8:31 PM IST

Updated : Oct 4, 2021, 9:03 PM IST

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి అయితే.. తొలి ద్రోహి రేవంత్ రెడ్డి అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ది తిన్నది అరగక చేసిన అజీర్తి యాత్ర అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దళిత బంధు పథకం రాష్ట్రమంతటా అమలు చేసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ktr
ktr

చంపినోళ్లే సంతాపం చెప్పినట్లుగా.. కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్​లో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు మున్సిపాలిటీ.. వికారాబాద్ జిల్లా మోమిన్​పేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రమే మెచ్చుకుంటుంటే.. స్థానికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలకు నచ్చడం లేదని.. అందుకే విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 945 గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు, గర్భిణుల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కారని కేటీఆర్​ గుర్తుచేశారు.

'ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదు.. అక్కడ కూడా దళితబంధు ఇస్తాం'

రాష్ట్ర అభివృద్ధి గురించి కేంద్రమే చెబుతుంది..

భారతదేశంలో తెలంగాణ జనాభా కేవలం 2.5 శాతం మాత్రమే ఉండగా... భారత ఎకానమిలో మాత్రం నాలుగో స్థానంలో ఉందని... ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు ప్రకటించిందని... దీనిని బట్టే రాష్ట్ర అభివృద్ధిని అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని బాగుచేసే క్రమంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారుతుందన్నారు.

రాజీనామా చేయాల్సిన పనిలేదు..

రాష్ట్రమంతా దళితబంధు ఇచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్​ అన్నారు. మునుగోడులో కూడా దళితబంధు ఇస్తామని... అందుకోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

దేశంలో 60 ఏళ్లు కాంగ్రెస్​ పరిపాలన చేసింది. వాళ్లు ఇప్పుడొచ్చి.. ఈ రోడ్డు అలా ఎందుకుంది..?, ఈ మోరీ ఇలా ఎందుకుందని అడుగుతున్నారు. మరి 60 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఏమి చేశారు.? దేశంలో కాంగ్రెస్​ పార్టీ ఉనికిని కోల్పోతోంది. 60 ఏళ్లు పరిపాలన చేసిన వాళ్లు... మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చింది ఏముంది.? దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మునుగోడులో లేని ఫ్లోరోసిస్.. కాంగ్రెస్​ పాలనలో వచ్చింది. శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు. తెలంగాణ ఉద్యమంలో తొలిద్రోహి రేవంత్​రెడ్డి కాదా..? టీపీసీసీ అధ్యక్ష పదివికోసం మాణిక్కం ఠాగూర్​కు రూ.50 కోట్లు ఇచ్చాడని ఆపార్టీ ఎంపీనే చెప్పారు. ఆ డబ్బులు సంపాదించుకోవాలి కదా.. టికెట్లు అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలనే తప్ప వాళ్లకు ఇంకో ఆలోచన లేదు. రాష్ట్రంలో తెరాస అనేది లేకపోతే.. టీపీసీసీ, టీ భాజపా ఎక్కడిది. భాజపా చేసేది పాదయాత్ర కాదు.. అజీర్తి యాత్ర. కేసీఆర్​ ఇచ్చిన గొర్రె పిల్లను ఎత్తుకుంటారు, కేసీఆర్​.. చెరువుల్లో వేసిన చేప పిల్లలను బండి సంజయ్ పట్టుకుంటారు, పచ్చని పొలాల్లో వెళ్తుంటారు, అక్కడక్కడా కేసీఆర్​ ఇచ్చిన మిషన్​ భగీరథ నీళ్లు తాగుతూ చేసే.. యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. అజీర్తి యాత్ర. ఒకరేమో పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని... ఇంకొకరేమో కేవలం డబ్బు సంపాదించాలని, ప్రజలను ఆగం చేయాలని చేయడమే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. -కేటీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు. ​

ఇదీ చూడండి: Minister KTR on Old City Development: 'కాంగ్రెస్‌ కంటే 4 రేట్లు ఎక్కువ ఖర్చు చేశాం'

Last Updated :Oct 4, 2021, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.