ETV Bharat / state

వన్య ప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి: ఇంద్రకరణ్​

author img

By

Published : Apr 7, 2020, 6:00 PM IST

రాష్ట్రంలో ఉన్న పెద్ద పులులు, ఇత‌ర వ‌న్య ప్రాణుల‌ రక్షణకు త‌గిన జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌ని అట‌వీ శాఖ అధికారుల‌ను మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు.

Minister Indrakaran reddy today news
Minister Indrakaran reddy today news

అమెరికాలోని బ్రాంక్స్ జూలో పులికి కరోనా వైరస్ సోకిన నేప‌థ్యంలో తెలంగాణలో వ‌న్య ప్రాణుల ఆరోగ్య సంర‌క్షకు తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి అట‌వీ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ మేర‌కు పీసీసీఎఫ్ ఆర్.శోభ‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. జూపార్కులు, కవ్వాల్‌, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉన్న జంతువులు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

జంతువుల‌కు సుర‌క్షిత‌మైన ఆహారం అందించాల‌ని సూచించారు. జూలో జంతువులకు ఆహారం అందించే కీపర్లకు కూడా కరోనా పరీక్షలు చేయించాల‌ని చెప్పారు. జూలో జంతువులన్నింటినీ జంతు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జంతువులకు కరోనా సోకకుండా వైద్య, పశుసంవర్థక, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల‌ని కోరారు.

అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ల్లో సీసీ కెమెరాల ద్వారా పులుల ఆరోగ్య పరిస్థిని తెలుసుకుంటున్నట్లు పీసీసీఎఫ్ మంత్రికి వివ‌రించారు. మ‌రోవైపు వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సౌరశక్తి బోర్ల ద్వారా చిన్న చిన్న గుంతలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్ పిట్లలో నీరు నింపేలా చ‌ర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని మంత్రి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.