ETV Bharat / state

Lal Darwaja Bonalu 2023 : కన్నుల పండువగా లాల్​దర్వాజ బోనాలు.. రేపటితో ముగియనున్న వేడుకలు

author img

By

Published : Jul 16, 2023, 10:03 PM IST

Laldarwaja Simhavahini Mahankali Bonalu : భాగ్యనగరం బోనమెత్తింది. నగరమంతా పండుగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు సహా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Lal Darwaja Bonalu
Lal Darwaja Bonalu

పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు

Hyderabad Bonalu 2023 : పసుపు లోగిళ్లు పచ్చని తోరణాలు బోనాల పండుగ భాగ్యనగరానికి సరికొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో జరుపుకునే సంబురాలు తుదిఘట్టానికి చేరాయి. గోల్కొండలో తొలిబోనంతో ప్రారంభమైన ఉత్సవాలు దిగ్విజయంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలను జరుపుకుని లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని పూజిస్తూ కనులపండువగా జరుగుతున్నాయి.

తెల్లవారుజామునే లాల్‌దర్వాజ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మెుక్కులు చెల్లిస్తున్నారు. సింహవాహిని ఆలయంతోపాటు ఇతర ఆలయాలు బోనాల శోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారుసహా పలు ప్రముఖ ఆలయాలను మంత్రి తలసాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్​కే పురం డివిజన్‌లో ఖిల్లా మైసమ్మ అమ్మవారికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

"ఇవాళ తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్​ ప్రభుత్వం.. బోనాల పండుగను అధికార పండుగగా మార్చింది. హైదరాబాద్​లో ఘనంగా బోనాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, వర్షాలు బాగా పడాలి.. పంటలు బాగా పండి తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా."- ఇంద్రకరణ్​ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి

కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ కుటుంబసభ్యులు అమ్మవారికి మహాభిషేకం చేశారు. రాజ్‌భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారికి గవర్నర్ తమిళసై బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు.

హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్​ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళా క్రికెటల్ మిథాలీరాజ్ బోనం ఎత్తుకుని మొక్కులు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Secunderabad Ujjain Mahankali Bonalu : సోమవారం ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో బోనాలు ముగియనున్నాయి. దాదాపు 2వేల మందితో దక్షిణ మండలం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

"తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, వర్షాలు బాగా పడి.. పంటలు బాగా పండాలని, ఆర్థికంగా స్థిరపడాలని అమ్మవారిని ప్రార్థించాను."- తమిళిసై సౌందర రాజన్, గవర్నర్


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.